సూర్యాపేట జిల్లా:వచ్చే హరితహారం ద్వారా రాష్ట్రమంతట 19.50 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.సిఎం ఆదేశాల మేరకు సిఎస్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు,నీటి పారుదల ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, హరితహారం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం,దళితబంధు,యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై సమీక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు.హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం,అటవీ విస్తీర్ణం 7.70 శాతం పెరిగిందని గుర్తుచేశారు.అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని,ఇప్పటి వరకు ఏర్పాటు చేయని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.దీనితోపాటు ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలని చెప్పారు.ఖాళీ స్థలాలను గుర్తించి,చిక్కటి పచ్చదనం పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.ఎండలు తీవ్రంగా ఉన్నందున హరితహారం మొక్కలకు వారంలో రెండు,మూడు సార్లు నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద,కాలువ గట్లపై పచ్చదనం పెంపు,పది శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంచటం ఎనిమిదవ విడత హరితహారం ప్రాధాన్యతా అంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు.
అన్ని సాగునీటి ప్రాజెక్టులు,కాలువ గట్ల వెంట పచ్చదనం పెంచటం అత్యంత ప్రాధాన్యతా అంశమని,ఇందు కోసం వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.దళితబంధు అమలును సి.ఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు.ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరు చేసి లబ్దిదారులను గుర్తించిన దళితబంధు యూనిట్లను వెంటనే గ్రౌండ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు.వరి ధాన్యం సేకరణ గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే ఏడు కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని,మరో 4.5 కోట్లు త్వరలో వస్తాయని ఆయన అన్నారు.అన్ని రైతు వేదికల్లో రైతు సమావేశాలు నిర్వహించి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.రైతు వేదికలను క్రియాత్మకంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వచ్చే హరిత హారంలో ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో విరివిగా మొక్కలను నాటే లక్ష్యం పెట్టుకున్నామని,వేసవి దృష్ట్యా రూరల్, అర్బన్ ప్రాంతాలలో ఉన్న అన్ని నర్సరీలలో మొక్కల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉన్నందున ప్రభుత్వ భూములలో విరివిగా మొక్కలను నాటేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రలలో ఇప్పటి వరకు 19 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించామని అలాగే అన్ని కేంద్రలలో ట్యాబ్ ఎంట్రీలు,చెల్లింపులు వెనువెంటనే చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదని ఇంకా 17 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అలాగే అన్ని కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ళు సజావుగా సాగుతున్నాయని అన్నారు.ఇప్పటికే జిల్లా సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ఠ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి నాలుగు నియోజకవర్గాలలో దళితబంధు లబ్దిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని ఈ సందర్బంగా కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్ రావు,పాటిల్ హేమంత్ కేశవ్, డి.ఎప్.ఓ ముకుందరెడ్డి,పి.డి.కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య,డి.ఏ.ఓ రామారావు నాయక్ మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.