దక్షిణాఫ్రికాలో భారత సంతతి న్యాయ కోవిదుడు చరిత్ర సృష్టించాడు.ఆ దేశ అత్యున్నత కోర్టు అయిన రాజ్యాంగ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన నరేంద్రన్ జోడీ కొల్లాపెన్ నియమితులయ్యారు.64 ఏళ్ల కొల్లాపెన్, రమ్మక స్టీవెన్ మాథోపోలను రాజ్యాంగ న్యాయస్థానానికి సుదీర్ఘమైన పబ్లిక్ ఇంటర్వ్యూల ప్రక్రియ తర్వాత నియమిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ రెండు ఖాళీల భర్తీ కోసం అక్టోబర్లో రామఫోసాకు సిఫార్సు చేసిన ఐదుగురు అభ్యర్ధుల్లో కొల్లాపెన్, మాథోపో వున్నారు.
వీరిద్దరూ జనవరి 1, 2022 నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.రాజ్యాంగ న్యాయస్థానానికి నియామకం కోసం కొల్లాపెన్ను గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూ చేశారు.అదే సంస్థకు తాత్కాలిక న్యాయమూర్తిగా రెండు పర్యాయాలు పనిచేసినప్పటికీ ఆయనకి విజయం దక్కలేదు.కొల్లాపెన్, మాథోపోలు న్యాయవాద వృత్తి, న్యాయ వ్యవస్థలో మంచి హోదాను కలిగి వున్నారని అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా వున్న కొల్లాపెన్ పదోన్నతిపై రాజ్యాంగ న్యాయస్థానానికి వెళ్తున్నారు.1982లో ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.1993లో లాయర్స్ ఫర్ హ్యూమన్ రైట్స్లో చేరిన నరేంద్ర.1995లో దానికి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.1996 వరకు ఆ పదవిలో పనిచేశారు.1997లో దక్షిణాఫ్రికా మానవ హక్కుల కమిషన్కు కమీషనర్గా బాధ్యతలు చేపట్టారు.2002 నుంచి 2009 వరకు ఏడేళ్లపాటు ఆ సంస్థకు అధ్యక్షుడిగానూ పనిచేశాడు.
2016 ఏప్రిల్లో నరేంద్ర దక్షిణాఫ్రికా చట్ట సంస్కరణల కమీషన్కు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.ఐక్యరాజ్యసమితి, హార్వర్డ్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ వేదికలతో పాటు మరెన్నో చోట్ల మానవ హక్కుల సమస్యలపై ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆహ్వానాలు అందుకున్నాడు.న్యాయ శాస్త్రానికి అందించిన సేవలకు గాను నరేంద్రకు డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
అలాగే టర్కోయిస్ హార్మొనీ ఇన్స్టిట్యూట్ అవార్డ్, కాంగ్రెస్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ నుంచి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన అందుకున్నారు.