ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.కోవిడ్ కేసులు, మరణాల్లో పెద్దన్న టాప్ ప్లేస్లో నిలిచాడు.
వైరస్ దేశంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది.అయితే వేగవంతంగా వ్యాక్సినేషన్, కఠిన ఆంక్షల కారణంగా అమెరికా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత దేశ ప్రజలు ‘‘థ్యాంక్స్ గివింగ్ డే’’ను జరుపుకున్నారు.ఈ సందర్భంగా అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సమయంలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.ఈ మేరకు మసాచుసెట్స్లో సెలవు రోజును గడిపడానికి వెళ్లేముందు ప్రథమ మహిళ జిల్ బైడెన్తో కలిసి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇక పర్యటనలో భాగంగా యూఎస్ సర్వీస్ మెంబర్లను, స్టేషన్ సిబ్బందిని బ్రాంట్ పాయింట్ వద్ద బైడెన్ కలిశారు.అలాగే థ్యాంక్స్ గివింగ్ పరేడ్ను విక్షించారు.ఈ మార్చ్లో పాల్గొనేవారు , ఉద్యోగులు, వాలంటీర్లు తప్పనిసరిగా కోవిడ్ 19 టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం ముందే ఆదేశాలు జారీ చేసింది.
బైడెన్ ఆయన భార్య 1977లో వివాహం చేసుకున్నప్పటి నుంచి నాన్టుకెట్లో థ్యాంక్స్ గివింగ్ డే ను గడుపుతూ వస్తున్నారు.అయితే 2015లో బైడెన్ కుమారుడు బ్యూ 46 ఏళ్ల వయసులో బ్రెయిన్ క్యాన్సర్తో మరణించిన తర్వాత .2020లో కోవిడ్ వెలుగులోకి వచ్చిన రెండు సందర్భాలలో మాత్రమే బైడెన్ దంపతులు నాన్టుకెట్కు రాలేదు.దీనికి బదులుగా గతేడాది ఆయన భార్య, కుమార్తె యాష్లే, అల్లుడితో కలిసి డెలావేర్లోని ఇంట్లో భోజనం చేశారు.
అయితే ఈ ఏడాది థ్యాంక్స్ గివింగ్ సంప్రదాయాన్ని జో బైడెన్ పున: ప్రారంభించారు.ఇందుకోసం మంగళవారం రాత్రి ఎయిర్ఫోర్స్ వన్లో కుటుంబం మొత్తం నాన్టుకెట్కు చేరుకుంది.భార్య జిల్ బైడెన్, కుమారుడు హంటర్, కొడలు మెలిస్సా, మనవళ్లు, మనవరాళ్లు బైడెన్ వెంట వున్నారు.
అధ్యక్షుడి హోదాలో నాన్టుకెట్కు రావడం బైడెన్కు ఇదే తొలిసారి.అంతకుముందు సెనేటర్, ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ డేను జరుపుకున్నారు.
అయితే గతంలో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లే జో బైడెన్ అధ్యక్షుడయ్యాక తానుగా తిరిగే స్వేచ్ఛను కోల్పోయారు.అగ్రరాజ్యాధినేత కావడంంతో ఆయన చుట్టు పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, వైట్హౌస్ అధికారులు, జర్నలిస్టులు వుంటున్నారు.
ఆయన ప్రతి కదలికను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిశితంగా గమనిస్తారు.