నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిన సంగతి తెలిసిందే.మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు సిక్కులకు అత్యంత పవిత్రమైన గురునానక్ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే వివిధ దేశాల్లో వున్న పంజాబీ సంతతి ప్రజలు కూడా కేంద్రం ప్రకటనను స్వాగతించారు.
తాజాగా అమెరికాలోని సిక్కు సంతతి కమ్యూనిటీ ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసల్లో ముంచెత్తింది.ఆయన నాయకత్వం రైతుల సమస్యలను పరిష్కరించిందని అన్నారు.
భారతదేశంలోని సిక్కు సమాజం, రైతుల ప్రయోజనాలను ప్రధాని మోడీ ఎల్లప్పుడూ పరిరక్షించారని కొనియాడారు.ఈ మేరకు అమెరికన్ సిక్కు కమ్యూనిటికి చెందిన జస్సే సింగ్ బుధవారం వర్జీనియా సబర్బ్ కమ్యూనిటీ ఫెసిలిటేషన్ ఈవెంట్ను నిర్వహించారు.
వ్యవసాయ రంగంలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో గతేడాది సెప్టెంబర్లో పార్లమెంట్ మూడు చట్టాలను ఆమోదించిన సంగతి తెలిసిందే.దీనిపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు.
ఇది రైతుల పాలిట శరాఘాతంగా మారుతుందని.వ్యవసాయ రంగం కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన రైతులు రాకేశ్ టికాయత్ నేతృత్వంలో ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసి ఆందోళన నిర్వహించారు.
అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభించింది.ముఖ్యంగా యూకే, కెనడియన్ ఎంపీలు, ఎమ్యెల్యేలు ఇతర రాజకీయవేత్తలు రైతుల నిరసనకు అండగా నిలిచారు.ఢిల్లీలో రిపబ్లిక్ డే నాడు రైతుల మార్చ్పై నీటి ఫిరంగి, పోలీసు బలగాలను ప్రయోగించడాన్ని సైతం వారు ఖండించారు.
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన ఘటనను సైతం పంజాబీ సంతతి ఎంపీలు ఖండించారు.ఏడాది పాటు జరిగిన ఈ ఆందోళనకు కేంద్రం దిగిరాక తప్పలేదు.
మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రద్దు బిల్లును ప్రవేశపెట్టి.నవంబర్19న ఆమోదింపజేసుకుంది మోడీ సర్కార్.