లలితా సహస్ర నామాలలో ‘పద్మ నాభ సహోదరీ, నారాయణీ‘ అని పార్వతీ దేవి అని ఉంది.శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ! నమోస్తుతే’ ఇత్యాది స్తుతులలో కూడా పార్వతి దేవి నారాయణిగా కీర్తింప బడుతున్నది.
ఒక సారి దేవతలు రాక్షస సంహారార్థమై యజ్ఞం చేశారు.దేవి కరుణతో ఆ హోమకుండం నుండి ఒక అండం ఆవిర్భవించింది.
అండము యొక్క అర్ధ భాగం నుండి శ్రీ మహా విష్ణువు, తక్కిన సగం భాగం నుండి పార్వతి దేవి ఉద్భవించారు.ఇలా ఏకాండ సంభవులు కావడం వల్ల పార్వతి మహా విష్ణువు సోదరి అయింది.
ఇందుకు మరొక వివరణ కూడా ఉన్నది.
బ్రహ్మ దేవుడి సంకల్పం వల్ల ప్రకృతి పురుషులు ఉద్భవించారు.
వీరిద్దరూ కర్తవ్యం తెలియక విచారంతో ఉండగా ఆకాశ వాణి “నీటిలో తపస్సు చేయండి.మీకు కర్తవ్యం స్ఫురిస్తుంది” అని అంటుంది.ఆపై వారిరువురూ నీటిలో తపస్సు చేసి కర్తవ్యం గ్రహిస్తారు.‘అపో నారా ఇతి ప్రోక్తాః’ అన్నట్లు నీటికి ‘నారములు’ అని పేరు.నారముల వల్ల అయినమును, అనగా కర్తవ్యమును గ్రహించారు కాబట్టి పార్వతి నారాయణిగా, విష్ణువు, నారాయణుడుగా రూపొందారని శివ పురాణంలో ఉంది.నారములు అయనంగా (నివాసంగా) ఉండి తపస్సు చేసిన రు అని కూడా వివరించవచ్చు.
ఇలా ఒక్కో పురాణంలో ఒక్కో కథ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ… ప్రతీ చోట పార్వతీ దేవి, శ్రీ మహా విష్ణువు సోదరసోదరీమణులుగా కీర్తింపబడుతున్నారు.