జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యారు.గతంతో పోలిస్తే జనసేన పార్టీ ఏపీలో బాగా బలం పుంజుకునే విధంగా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
టిడిపి, జనసేన కలవబోతున్నాయి అనే సంకేతాలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి.విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తర్వాత పవన్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడంతో పాటు, తన గ్రాఫ్ ప్రజల్లో మరింత పెంచుకునేందుకు వైసిపి ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేసుకుని అనేక ప్రశ్నలను సందించారు.2024 ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న క్రమంలో పవన్ ఈ స్థాయిలో ఫోకస్ పెంచడం ఏపీ అధికార పార్టీ వైసిపి కి టెన్షన్ పుట్టిస్తుండగా, టిడిపి మాత్రం పవన్ గ్రాఫ్ మరింత పెరిగితే, అది తమకు కలిసి వస్తుంది అనే లెక్కల్లో ఉంది.జనసేన పార్టీ తరఫున ఏపీ మంత్రులను ప్రశ్నిస్తూ పవన్ అనేక ప్రశ్నలు సంధించారు. మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా లేదంటే చౌకబారు విమర్శలతో పదవీకాలం అంతా వెళ్ళదీస్తారా అంటూ పవన్ ప్రశ్నించారు.మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జోగి రమేష్, బొత్స సత్యనారాయణ , గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, విడుదల రజిని, దాడిశెట్టి రాజాలను టార్గెట్ చేసుకుంటూ పవన్ ఫోటో క్యాప్షన్ రూపంలో ఒక్కో మంత్రికి ఒక్కో ప్రశ్నను వేశారు.

ఏపీ అప్పుల చిట్టా ఎంతో లెక్క చెప్తారా ? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో ప్రజలకి వివరణ ఇవ్వగలరా బుగ్గన ? కొండలు చెరువుల్లో కాకుండా నివాసయోగ్యమైన భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్ని కట్టించారో చూపగలవా జోగి ? పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని దశబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించగలరా బొత్స ? నీ రికార్డింగ్ డాన్సులు అయిపోయాక ఖాళీగా ఉన్న సమయంలో కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి శ్వేతపత్రం విడుదల చేయగలవా గుడివాడ ? పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఇప్పటివరకు నువ్వు చేసిన బృహత్ కార్యం ఏపీ ప్రజలకు సూటిగా చెప్పగల సత్తా ఉందా మహానటి రోజా ? ఇంకెంత మందిని గుంతల రహదారులు బలి తీసుకుంటే మొద్దు నిద్ర పోతారో తెలుపగలవా దాడిశెట్టి ? నీ సహచర మంత్రులు అనారోగ్యానికి గురైతే పక్క రాష్ట్రాలకు పారిపోకుండా ఏపీలోనే వైద్యం చేయించుకునే స్థాయి సదుపాయాలు ఎప్పుడు కలిపిస్తారో పబ్లిసిటీ క్వీన్ విడతల రజిని .! అంటూ తనదైన శైలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా మంత్రులపై పవన్ విమర్శలతో విరుచుకు పడ్డారు. .







