సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఆట స్థలంగా మార్చుకొని విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం ఆదివారం క్యూ న్యూస్ కెమెరాకు చిక్కింది.గత వానాకాలం సీజన్లో వర్షాలు సరిగ్గా కురువక,నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు రాక,సాగర్ జలాయశం అడుగంటిన విషయం తెలిసిందే.
దీనితో ఎడమ కాలువకు నీటి విడుదలకు అవకాశం లేక ఆయకట్టు కింద వ్యవసాయం పూర్తిగా తగ్గిపోయి దాదాపుగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.కొద్దో గొప్పో బోర్లు,బావుల కింద సాగు చేసిన పంటలకు యాసంగి నీటి కొరత ఏర్పడి ఎండిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో వరుసగా మూడు రోజులు స్కూల్స్ కి సెలవులు రావడంతో నీళ్లు లేక ఎండిపోయి గ్రౌండ్ లాగా మారిన సాగర్ ఎడమ కాలువ విద్యార్థులకు క్రీడా స్థలంలా మారింది.ఆదివారం విద్యార్థులు,చిన్నపిల్లలు సరదాగా క్రికెట్,ఇతర ఆటలు ఆడుతున్నారు.
ఈసారైనా వర్షాలు బాగా కురిసి సాగర్ డ్యామ్ నిండితే,ఎడమ కాలువ నీటి విడుదల కావాలని పలువురు రైతులు కోరుతున్నారు.