నల్లగొండ జిల్లా:జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత ఆశా వర్కర్ పై హత్యాచార ఘటన అమానుషమని,ఘటన జరిగి వారం రోజుల అవుతున్నా నిందితున్ని పోలీసు యంత్రాంగం అరెస్టు చేయకపోవడం దారుణమని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు.శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం నేర్మట గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కామాంధుడు దౌర్జన్యంగా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డా ఇప్పటివరకు అరెస్టు చేయలేదని,బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని,పోలీస్ యంత్రాంగం నిందితుడికి అండగా ఉండి బాధితురాలికి అన్యాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కఠినంగా వ్వవహరించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు.
తక్షణమే నిందితునిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలన్నారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిర్లక్ష్యంగా వ్వవహరించిన పోలీస్ అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకొని,ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితునిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కఠినంగా శిక్షించాలని,బాధితురాలికి సరైన వైద్యం అందించి,ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం,ఇతర ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్వవహరించి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,మహిళల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈరటి వెంకటయ్య, అంతిరెడ్డి,గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి,ఎస్కే.జహంగీర్, యాదయ్య,నరసింహ,వెంకన్న, లక్ష్మమ్మ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.