నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి,ప్రైవేట్,కార్పోరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ వేస్తుందని విద్యార్థి సంఘాల నేతలు టీఆర్ఎస్ సర్కార్ విద్యా విధానాలపై మండిపడ్డారు.నకిరేకల్ పట్టణంలోని శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల నుండి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ఎన్.
ఎస్.యు.ఐ.,ఎ.బి.వి.పి., టి.ఎస్.యు.విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆయా విద్యా సంస్థల ముందు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ,శ్రీ చైతన్య బ్రాండ్ పేరుతో ముద్రించిన పుస్తకాలను పాఠశాల సమీపంలోని ప్రైవేటు నివాస గృహాల రూమ్ లలో డంపు చేసి,ఒక్కో పుస్తకాల సెట్ రూ.10 వేలకు పైగా విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని అన్నారు.పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని,ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని,అధికారులకు కార్పొరేట్ సంస్థలకు లోపాయికారంగా ఉన్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
విద్యాశాఖ అధికారులు ప్రైవేట్,కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలతో కుమ్మక్కవడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అధికారులపై వస్తున్న ఆరోపణలు నిజం కాకుంటే వెంటనే శ్రీచైతన్య స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న ప్రైవేట్,కార్పొరేట్ స్కూల్లలో అమలు చేస్తున్న దుర్మార్గమైన విద్యా వ్యాపార దోపిడీని అరికట్టి,తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.