నల్గొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.వరుసగా మూడు రోజుల నుండి 5 ఇళ్లల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు.
పట్టణంలోని 15వ వార్డుకు చెందిన తోనుపునూరి భిక్షపతి కుటుంబ సమేతంగా షిరిడికి వెళ్లి తిరిగి రాగా ఇంట్లో ఏడు తులాల బంగారం,70 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు.మార్చి 1వ తేదీ నుండి నేటి వరకు దాదాపు ఎనిమిది చోట్ల చోరీలు జరిగినట్లు తెలుస్తోంది.
చోరీలు జరిగిన ఇళ్లలో పోలీసులు క్లూస్ టీం లతో ఆధారాలు సేకరిస్తున్నారు.ఈ దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే ఈరోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న సాయి గణేష్ జ్యువెలరీ షాపు స్వెటర్ ను పగులగొట్టి వెండి,బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
దుండగులు దొరకకుండా ఉండాలని షాప్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ లను సైతం ఎత్తుకెళ్లి పోలీసులకు దొంగలు సవాల్ గా మారారు.నకిరేకల్ పట్టణంలో ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాలు సైతం పని చేయక పోవడం గమనార్హం.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.ప్రజలు రాత్రి సమయాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.