నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది.శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
గతంలో చైర్మన్ గొంగిడిని తొలగించాలంటూ 14 మంది డైరెక్టర్లు డీసీఓ కిరణ్ కుమార్ కు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.దీనితో శుక్రవారం డీసీఓ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డైరెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి హాజరైన 15 మంది డైరెక్టర్లు ప్రస్తుత చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గింది.నూతన చైర్మన్ ఎంపిక కోసం త్వరలోనే ఓటింగ్ నిర్వహిస్తామని డీసీఓ తెలిపారు.
జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్రం తిప్పడంతో డీసీసీబీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే కనిపిస్తుంది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో స్థానిక సంస్థలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
మున్సిపాలిటీలు,మండల పరిషత్ లు,సొసైటీలు ఒక్కోటి తమ వైపుకు తిప్పుకున్న హస్తం పార్టీ,మొన్న డిసిఎంఎస్,ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ కూడా కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న చైర్మన్ ఎంపికలో నూతన డీసీసీబీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి నియామకం కానున్నట్లు సమాచారం.