ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

నల్లగొండ జిల్లా:ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యమే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కు గండి పడడానికి ప్రధాన కారణమని రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు.ఎడమ కాలువకు వేంపాడ్ వద్ద గండి పడిన ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం సీపీఎం,రైతు సంఘం బృందం సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

 The Negligence Of The Nsp Officials Is The Cause Of The Accident-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువకు గండి పడి ప్రాణనష్టం నుండి ప్రమాదం తప్పిందని,వందలాది ఎకరాలు వరి పొలాలు కొట్టుకుపోయి నీటమునిగి పోయాయని,హైవే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.నిడమనూరు,నర్సింహాలగూడెం గ్రామాలలో ఇండ్లలోకి వరద నీరు చేరి రాత్రంతా ప్రజలు భయాందోళనకు గురయ్యారని అన్నారు.నాగార్జున సాగర్ ఆధునికీకరణలో భాగంగా సుమారు 4444.4 కోట్లతో పనులు చేపట్టి,నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, అధికారులు పర్యవేక్షణ లేకుండా నాసిరకం పనులు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.గత మూడు,నాలుగు రోజులుగా కట్ట వెంట నీటి లీకేజీ వస్తున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని,దానివల్ల ప్రమాదం జరిగిందని,అర్ధరాత్రి జరిగివుంటే ప్రమాదం అంచనా వేయలేక పోయేవాళ్ళమని వాపోయారు.గురుకుల పాఠశాల పూర్తిగా నీట మునిపోయిందని సాయంత్రం కావడం వల్ల స్థానికులు ప్రమాదాన్ని గమనించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందన్నారు.

ఇండ్లు,కొన్ని వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయని, సుమారు 500 ఎకరాలు వరి పంట పూర్తిగా నష్టపోయిందని,కష్టపడి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటు పెడితే చిరు పొట్ట దశలో ఇలా జరగడం రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.నష్టపోయిన రైతంగానికి ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

యుద్ద ప్రాతిపదికన గండి పూడ్చి,మిగతా పంటలకు సకాలంలో నీరందించాలని, ప్రమాదానికి కారకులైన ఎన్.ఎస్.పి.అధికారులపై చర్యలు తీసుకొని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి,లేకుంటే సీపీఎం,రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను,మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, రైతు సంఘం జిల్లా నాయకులు మంగారెడ్డి,కోమాండ్ల గురువయ్య,వెంకట్ రెడ్డి,ఖమ్మంపాటి శంకర్,ఆకారపు నరేష్,కుంచెం శేఖర్,రమేష్,కేశవులు,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube