నల్లగొండ జిల్లా:నల్లగొండ సబ్ డివిజనల్ పరిధిలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ “మిషన్ పరివర్తన్- యువతేజం”లో భాగంగా ప్రారంభించిన పోలీసు క్రీడా పోటీలు గురువారం రాత్రి ముగిశాయి.ఈ పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన శాలిగౌరారం,రెండవ స్థానం పొందిన నల్గొండ రూరల్, మూడవ స్థానం దక్కించుకున్న కేతేపల్లికి చెందిన విజేతలకు నల్లగొండ డిఎస్పీ కె.
శివరాంరెడ్డి నగదు పారితోషకంతో పాటు షీల్డ్ బహుకరించి,సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీలలో గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఇక నుండి గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకై యువత ముందుకు రావాలన్నారు.
ఈ క్రీడల ద్వారా పోలీసులతో గ్రామాలలోని యువతకు మంచి సంబంధాలు పెరిగాయని,ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే పోలీసు వారికి తెలియజేసే విధంగా ఈ క్రీడలు తోడ్పడతాయని సూచించారు.
అలాగే రానున్న రోజులలో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నేర నివారణలో యువతను భాగస్వామ్యం చేస్తామని తెలియజేశారు.
క్రీడలు శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతాయని,అదే విధంగా క్రీడలను అలవాటుగా చేసుకుంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను,అనుకోని పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వస్తుందని,ఓటమిని కూడా కసితో,పట్టుదలతో ప్రయత్నించి గెలుపుకి నాందిగా మలుచుకోగలుగుతారని,జట్టుగా కలిసి ఓటమిని జయించే దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.ఈ పోటీలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా నిర్వహించిన పీఈటీలను,పిడిలను అభినందించారు.
పోటీలను ఆర్గనైజ్ చేసిన నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,నల్గొండ టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు,ట్రాఫిక్ సిఐ రాజు ఎస్సైలు విష్ణు,సైదాబాబు, సాయిప్రశాంత్,సైదులు,శివకృష్ణ మరియు సిబ్బందిని అభినందించారు.