సూర్యాపేట జిల్లా:నిరుద్యోగ యువతీ యువకులు అపోహలు వీడి పట్టుదలతో చదివి విజయం సాధించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలోని ఎస్వి జూనియర్ కళాశాలలో శ్రీ సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను తెచ్చిందని,నిరుద్యోగ యువతీ యువకులు ఉత్సాహంగా ఉద్యోగాల ఎంపికలో పోటీ పరీక్షలో పాల్గొనాలన్నారు.ప్రభుత్వం రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో ఉందన్నారు.
ఉద్యోగాల ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని మధ్యవర్తులను దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.ఇంతవరకు ఏ ప్రభుత్వం విడుదల చేయని భారీ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
ఉద్యోగాలకు పరీక్షలు రాసే అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల మార్గదర్శకం విజయం సాధించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు.శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కు తన వంతు సహకారం అందిస్తానన్నారు.
ప్రతిభ కలిగిన పేదవారికి స్టడీ మెటీరియల్ అందిస్తానని, ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించాలని కోరారు.ఆత్మ విశ్వాసం,పట్టుదల,నిరంతర కృషి విజయాలకు సోపానాలు అన్నారు.
నగరాలకే పరిమితమై ఉన్న కోచింగ్ సెంటర్లను విద్యావేత్త అనంతారపు కృష్ణయ్య కోదాడ పట్టణంలో పేద,మధ్య తరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా నుసన్మానించారు.
ఈ కార్యక్రమంలో కె.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల విశ్రాంత ఆంద్రోపన్యాసకులు మంత్రిప్రగడ భరతరావు,ఎస్వి విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వరరావు,టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ,బుర్ర పుల్లారెడ్డి,మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ బ్రహ్మం,ఈదుల కృష్ణయ్య ఉపాధ్యాయులు బడుగుల సైదులు,శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.