సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార పథకానికి కొందరు వ్యక్తులు తూట్లు పొడుస్తూ రోడ్ల వెంట నాటిన హరితహారం చెట్లను నరుకుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోని వైనం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది.ప్రభుత్వం చెట్లను నాటుతుంటే కొందరు వాటిని కొట్టడమే పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.
వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మద్దిరాల ఎక్స్ రోడ్ నుండి దంతాలపల్లికి వెళ్లే రోడ్డులో పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న పెద్ద వృక్షాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికి వేశారు.కొన్ని వేల రూపాయిలు ఖర్చు పెట్టి పెంచిన చెట్లను నరకడం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగే చెట్లను నరుకుతూ పోతే భవిష్యత్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుందని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలు ఇప్పటికైనా గ్రహించకపోతే,ఆక్సిజన్ కొరత,వాయు కాలుష్యం భవిష్యత్తులో ఒక సాధారణ సమస్యగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.చెట్లను ఇష్టానుసారం నాశనం చేస్తున్న తీరును చూస్తుంటే భవిష్యత్తులో ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ కొనుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని పర్యావరణవేత్తలు అంటున్నారు.
అయినా ప్రకృతి విషయంలో ప్రభుత్వ సంస్థలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు.ఇట్టి విషయంపై ఫారెస్ట్ అధికారులు స్పందించి,తక్షణమే బొగ్గు బట్టీల కోసం చెట్లను నరుకుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
.