సూర్యాపేట జిల్లా: జిల్లాలో దళిత బంధు పథకంలో భారీ అవినీతి జరిగిందని టిపిసిసి మాజీ అధ్యక్షులు,నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.బుధవారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుడిబండ గ్రామానికి చెందిన దళిత బంధు బాధితులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గుడిబండ గ్రామంలో ఒక్కొక్క దళిత లబ్ధిదారుల నుండి రెండు లక్షలు రూపాయలు వసూలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని, తక్షణమే దళిత బంధు పథకంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని,అంతమందు స్కీములో ఎంతోమంది లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసినా ఎవరూ బయటకు చెప్పకుండా ఉన్నారని తెలిపారు.
8 నెలల క్రితం గ్రామ గ్రామాన తాను తిరుగుతున్న సమయంలో గుడిబండ గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారని,ఇదే విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారని తెలిపారు.అయినప్పటికీ ఎటువంటి విచారణ చేయలేదని,అదే కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఇప్పుడు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రమోషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
దళిత బంధు పథకంలో 5 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని, దళితబంధు కింద లబ్ధిదారులు కొంతమంది అధికార పార్టీ నాయకుల మోసపూరిత వాగ్దానాలతో ఒక్కొక్కరు రెండు లక్షల చొప్పున ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారని, కొందరు రెండు లక్షలు రూపాయలు మధ్య దళారులకు ఇవ్వకపోవడంతో దళితులకు వచ్చిన పశువులను,ఇతర సామగ్రిని తీసుకెళ్లడం దురదృష్టకరమన్నారు.దళితబంధులో 50% వాటా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
కోదాడ మండల ఎంపీపీ అనుచరులు దళితబంధులో డబ్బులు తీసుకోవడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దళితులు నా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమవుతున్నారని, పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నాయకుల తొత్తులుగా మారారని, ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయం సీఎం కేసీఆర్,జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
ఇదిలా ఉంటే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరిని దళిత బంధు పథకం కింద ఎంపిక చేస్తే అక్కడ దళితబంధు పేరుతో అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల వద్ద లక్షల్లో వసూలు చేసినట్టు వార్తలు నిలబడుతున్నాయని,జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ఇదే తంతు జరుగుతుందన్నారు.జిల్లాలో జరుగుతున్న దళితబంధు పథకం అవినీతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసి,బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.