సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో నెలకొల్పిన గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఈనెల 9వ తేదీ శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్ తెలిపారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనంపై పట్టణంలోని ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనం ఎప్పుడు చేయాలో అనే సందిగ్ధంలో ఉన్న విషయమై కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిమజ్జన తేదీని ఖరారు చేశారు.31వ తేదీ బుధవారం ప్రారంభమైన గణేష్ నవరాత్రులు 8వ తేదీ గురువారం ముగియడంతో 9వ తేదీ శుక్రవారం రోజున నిమజ్జనం చేసే విధంగా నిర్ణయించారు.ఈ మేరకు పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఏర్పడ్డ గుంతలను కమిటీ అధ్యక్షుడు అనంతుల కృపాకర్ తన సొంత ఖర్చులతో జేసీబీ ఏర్పాటు చేసి గుంతలను చదును చేయించారు.
నిమజ్జనానికి వచ్చే శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం జరగకుండా మున్సిపల్,పోలీస్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.గతంలో మాదిరిగానే సూర్యాపేటలో నెలకొల్పిన గణేష్ విగ్రహాలను పట్టణంలోని చౌదరి చెరువులో నిమజ్జనం చేసేందుకు పురపాలక సంఘం వారు ఎప్పటిలాగే రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారని,దూర ప్రాంతాలకు వెళ్లకుండా సూర్యాపేట పట్టణంలోనే గణనాథులు నిమజ్జనం చేసి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భానుపురి గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు,ఉపాధ్యక్షులు బైరు వెంకన్న గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చలమల్ల నర్సింహ్మ,తోట శ్యామ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.