సూర్యాపేట జిల్లా:దీపావళి పండుగకు టపాసుల వ్యాపారులు రంగం సిద్ధం చేశారు.పట్టణంలోని రెడ్ చిల్లీ గ్రౌండ్ లో దీపావళి టపాసుల అమ్మకాల కోసం 28 షాపులకు అనుమతులు వచ్చాయి.దీనికోసం కోదాడ వర్తక సంఘం భవనంలో రహస్య సమావేశం నిర్వహించి ఒక్కొక్క షాప్ నుండి బలవంతంగా రూ.40 వేల చొప్పున సుమారు రూ.12 లక్షలు వసూళ్లు చేసినట్లు సమాచారం.నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల్లో అమ్మకాలు చేసేందుకే లక్షల్లో జీరో దందా చేసినట్లు తెలుస్తోంది.
అయినా సంబంధిత వాణిజ్య,అగ్నిమాపక శాఖ అధికారులకు పట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది.టపాసుల వ్యాపారంలో ఆరితేరిన కొందరు వ్యాపారులు తక్కువ పెట్టుబడితో సులువుగా ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు సిండికేటుగా చక్రం తిప్పుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనుమతులు మొదలుకొని అమ్మకాలు పూర్తయ్యే వరకు ప్లాన్ ప్రకారం ముందస్తుగానే వ్యాపారులంతా యూనియన్గా ఏర్పడి తమ వ్యాపారానికి ఎవరడ్డురాకుండా పకడ్బందీగా జాగ్రత్త పడుతున్నారు.టపాసుల అమ్మకాలు ఎలా జరగాలి?అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం టపాసుల దుకాణాలు నివాసాలకు దూరంగా,రేకులషెడ్డులో మాత్రమే ఏర్పాటు చేయాలి.షాపులో జాయింట్ విద్యుత్ తీగలను,లాంతర్లు,పెట్రోమ్యాక్స్లైట్లను ఉపయోగించరాదు.దుకాణాలలో బీడీ,చుట్టలు, సిగరేట్స్,అగ్గిపెట్టేలను వెలిగించరాదని, నోస్మోకింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలి.ప్రతీ షాపునకు కనీసం 3మీ.దూరముండాలి.ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం,అట్టపెట్టెలను వేయరాదు.18 ఏళ్ల లోపు పిల్లలను టపాసుల అమ్మకాల దుకాణాల్లో పనిలో పెట్టుకోరాదు.ఇసుక,వాటర్ బకెట్లను సిద్ధంగా ఉంచాలి.కోదాడలో అమ్మకాలు ఎలా జరుగుతాయి? జనావాసాల మధ్యలోనే కిరాణా షాపులతో పాటు పలు హోల్సెల్ దుకాణాల్లో టపాసులను విక్రయిస్తారు.అయినా సంబంధిత శాఖ అధికారులకు మాత్రం ఇవేవీ పట్టవనే విమర్శలు వినిపిస్తున్నాయి.కోదాడలో అమ్మకాలు జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న కాలనీ వాసులు టపాసుల దుకాణాల ఏర్పాటుపై అభ్యంతరం చెబుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే బాధ్యులు ఎవరన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.అనుమతులు పొందిన ఏ ఒక్క దుకాణం కూడా నిబంధనల ప్రకారం ఉన్నట్లు కనిపించడం లేదు.
అనుమతులు పొందుతూ తమ వ్యాపారాన్ని సాఫీగా సాగేందుకు అన్నిమార్గాల్లో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.ఒకరిద్దరు టపాసుల వ్యాపారులు అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటూ వారే ఈ తతంగమంతా నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ముందస్తుగానే కొందరు బడా వ్యాపారులు నెలరోజుల నుంచే గుట్టుచప్పుడు కాకుండా భారీగా టపాసులను దిగుమతి చేసుకుంటూ హోల్సెల్ వ్యాపారం సాగిస్తున్నారని సమాచారం.వ్యాపారులు చెప్పిందే ధర! టపాసులపై ప్రజలకు ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరకే కొనాల్సి వస్తుంది.
దీంతో అధిక ధరలతో అమ్మకాలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారు.ధర నియంత్రణపై అధికారులు దృష్టి సారించడం లేదు.
సామాన్య ప్రజలు టపాసులు పేల్చి పండుగ జరుపుకునే పరిస్థితులే కనిపించడం లేదు.కొనుగోలు చేసిన ధర కంటే పది రేట్లు పెంచి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.ఏటా జిల్లాలో కోట్ల రూపాయల టపాసుల వ్యాపారం జరుగుతున్నా వ్యాపారులు పన్నులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ముందే పన్ను చెల్లింపులు జరిగి పోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.తమిళనాడు రాష్ట్రంలోని శివకాసి,మహారాష్ట్రలోని నాగ్పూర్ తదితర ప్రాంతాల నుంచి టపాసులను అక్రమంగా దిగుమతి చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు.
అధికారులు తనిఖీలు జరిపి అక్రమ నిల్వలను బయటపెట్టే అవకాశం ఉన్నా పట్టింపే కనిపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం నిబంధనల ప్రకారమే టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయించాలి.
అమ్మకాలను ప్రారంభించగానే పర్యవేక్షణ చేస్తూ నిబంధనలు పాటించేలా చూస్తాం.వ్యాపారులకు అవగాహన కల్పించామని కోదాడ ఫైర్ అధికారి కిన్నెర రామలింగం చెప్పారు.