సూర్యాపేట జిల్లా:డ్రగ్స్ వినియోగం వలన యువశక్తి నిర్వీర్యం అవుతుందని,డ్రగ్స్ వాడకం ప్రాణాంతకం అని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.జిల్లా కేంద్రంలో శనివారం జూన్ 26 అంతర్జాతీయ డ్రగ్స్ వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
కొత్త బస్టాండ్ నుండి శంకర్ విలాస్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో జిల్లా పోలీసులు,విద్యార్థులు,యువత, పౌరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమని, డ్రగ్స్,గంజాయి,కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ అనేది దేశశక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని,రాష్ట్ర సీఎం,డీజీపీ ఆదేశాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి,జిల్లా వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉన్న,రవాణా చేస్తున్న గంజాయిని భారీగా సీజ్ చేశామని అన్నారు.ఈ డ్రగ్స్ అనేది సమాజాన్ని నాశనం చేస్తుందని,ఇది సమాజ మనుగడకు,యువత జీవితానికి వినాషణకారి,దీనిని సమాజం నుండి ప్రారద్రోలడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ వినియోగానికి,రవాణాకు దూరంగా ఉండాలని,దీనికి సంబంధించిన సమాచారం పోలీసు వారికి అందించాలని కోరారు.దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఆధారపడి ఉంటుందని,ఈ దేశంలో డ్రగ్స్ బారినపడి యువత వారి బంగారు భవిష్యత్తును తమ చేతులారా తామే నాశనం చేసుకుంటుందన్నారు.
ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కడో ఒక చోట వాటి పేర్లు వినిపించేవి కానీ,నేటి సమాజంలో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా డ్రగ్స్ వినియోగం ఉన్నందున దీనిపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా పెట్టిందన్నారు.యువత డ్రగ్స్ వ్యతిరేక నినాదంతో ముందుకు వచ్చి మన దేశ భవిష్యత్తును మార్చే దిశగా ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగభూషణం, సిఐ ఆంజనేయులు,ఎస్బి సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు శ్రీనివాస్,క్రాంతి,సైదులు,సురేష్,సాయి, మీడియా ప్రతినిధులు,సిబ్బంది పాల్గొన్నారు.
డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారిలో గుర్తించే ప్రారంభ లక్షణాలు:ఎలాంటి కారణం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో మార్పు.అభిరుచులు లేదా ఇతర కార్యక్రమాలలో ఆసక్తి చూపకపోవడం.ప్రతిభ తగ్గిపోవడం.రహస్యంగా,ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం.ఆహారం పట్ల నిర్లక్ష్యం,ఆకలి లేకపోవడం.
కొత్త స్నేహితులు,కొత్త పరిచయాలు.కోపం,చిరాకు, భయం,నీరసం.