మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి భారతీయులు ఇటీవలి కాలంలో వరుసగా సింగపూర్లో మరణశిక్షకు గురవుతున్నారు.తాజాగా డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన ఇద్దరు భారత సంతతి వ్యక్తుల మరణశిక్షను సింగపూర్ సుప్రీంకోర్ట్ సమర్థించింది.మార్చి 2016లో సుమారు 1.34 కిలోల గంజాయి రవాణాకు కుట్రపన్నినందుకు మలేషియాకు చెందిన కమలనాథన్ మునియాండీ(27), సింగపూర్కు చెందిన చంద్రు సుబ్రమణ్యం(52) దోషులుగా తేలడంతో వారికి కింది కోర్ట్ ఉరిశిక్ష విధించింది.
అయితే, తాము వీటిలో పాలుపంచుకోలేదని, డ్రగ్స్ గురించి తమకు అసలే పాపం తెలియదని వారిద్దరూ వాదించారు.ఇదే కేసులో దోషిగా ఉన్న మరో భారత సంతతి వ్యక్తి ప్రవీనాష్ చంద్రన్కు న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు 15 కొరడా దెబ్బలు శిక్ష విధించింది.
దాంతో ప్రవీనాష్ శుక్రవారం సుప్రీంలో అప్పీల్ వేశాడు.కానీ, ఆయన అప్పీల్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ సందర్భంగానే కమలనాథన్, చంద్రులకు విధించిన మరణశిక్షను కూడా న్యాయస్థానం సమర్థించింది.ఈ ముగ్గురు నేరం చేసినట్లు రుజువైనందున వారికి విధించిన శిక్షలు సరియైనవేనని కోర్టు పేర్కొంది.
ఇక డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులోనే భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగానికి సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తన మానసిక స్థితి బాగా లేనందున క్షమాభిక్ష ప్రసాదించాలని ధర్మలింగం తరఫు న్యాయవాదులతో పాటు ఆన్లైన్లో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి.
అయితే ఇటీవల నాగేంద్రన్ కోవిడ్ బారినపడటంతో మానవతా దృక్పథంతో ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.తర్వాత ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.ఈ వివాదం నడుస్తుండగానే.2018లో డ్రగ్స్ బ్యాగ్తో పట్టుబడిన 39 ఏళ్ల మలేషియన్ – ఇండియన్కు న్యాయస్థానం గతవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
క్లీనింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మునుసామి రామమూర్తిని ఈ కేసులో హైకోర్టు దోషిగా తేల్చింది.మీడియా కథనాల ప్రకారం మునుసామి హార్బర్ఫ్రంట్ అవెన్యూలో పార్క్ చేసివున్న బైక్లో డ్రగ్ బ్యాగ్తో పట్టుబడ్డాడు.తొలుత 6.3 కిలోల గ్రాన్యులర్ పదార్ధంతో పట్టుబడినట్లు వార్తలు వచ్చినప్పటికీ.తర్వాత 57.54 గ్రాముల హెరాయిన్ ఉన్నట్లు కనుగొన్నారు.అయితే ఒక వ్యక్తి తన బైక్ వెనుక పెట్టేలో బ్యాగ్ను వుంచడానికి తాను అనుమతించానని, అంతేతప్ప తనకు ఎలాంటి ప్రమేయం లేదని మునుసామి చేసిన వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు.అయితే సింగపూర్ చట్టాల ప్రకారం 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ అక్రమ రవాణా చేస్తే సదరు వ్యక్తికి మరణశిక్ష విధించేలా న్యాయస్థానాలకు అధికారం వుంది.