లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద సెప్టెంబర్ నెలలో భారతీయులు దాదాపు 2 బిలియన్ డాలర్లను పలు దేశాలకు పంపారు.ఇది మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా.
ఈ మొత్తంలో 60 శాతం కంటే ఎక్కువ డబ్బును చదువు కోసం విదేశాలకు పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఎల్ఆర్ఎస్ కింద ఏప్రిల్ – సెప్టెంబర్ నెలల మధ్యకాలంలో చెల్లింపులు 56 శాతం పెరిగి 8.9 బిలియన్లకు చేరుకున్నాయి.
ఇది ఏడాది క్రితం ఇదే సమయంలో 5.7 బిలియన్లుగా వుంది.విదేశీ ప్రయాణం, విదేశాల్లో చదువులు,బహుమతులు వంటి అనేక లావాదేవీల కోసం లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ప్రతి భారతీయుడికి ఏడాదికి 2,50,000 డాలర్లను విదేశాలకు పంపడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది.
వీటితో పాటు విరాళాలు, డిపాజిట్లు, ఈక్వీటీలు, బాండ్లలో పెట్టుబడి వంటి మూలధన ఖాతా లావాదేవీలు, ఆస్తి కొనుగోళ్లు కూడా ఎల్ఆర్ఎస్ కిందకు వస్తాయి.
అయితే ఆర్బీఐ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ అనుమతుల సాయంతో పలువురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు.
అలాంటి లావాదేవీలు చట్ట విరుద్ధమని వారు చెబుతున్నారు.మూలధన ఖాతా లావాదేవీల కింద జాయింట్ పేమెంట్స్, డిపాజిట్లు, ప్రాపర్టీ కొనుగోళ్లు, ఈక్వీటీలు, బాండ్లలో పెట్టుబడులు కలిపి ఇటీవలికాలంలో 25 శాతం పెరిగి 765 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అయితే ఈ కాలంలో విదేశాలకు ప్రయాణం, చదువులు అనే రెండు విభాగాల్లోనూ రెమిటెన్స్లు రెట్టింపయ్యాయి.
ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి అర్థభాగంలో ప్రయాణ ఖర్చులు 1.4 బిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్లకు చేరుకోగా.విదేశాల్లో చదువు కోసం చెల్లింపులు 1.5 బిలియన్ల నుంచి 3 బిలియన్లకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఈ రెమిటెన్స్లు మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.