సూర్యాపేట జిల్లా: తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమ యాదవ సామాజిక వర్గాన్ని గొర్ల పేరుతో మోసం చేస్తుందని, సుమారు పది నెలల కింద డీడీలు తీసిన వారికి ఇప్పటివరకు మోక్షం లేదని,అయినా రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తాము డీడీలు తీయమని సంబంధిత అధికారులు గ్రామాల్లో యాదవులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉరికిస్తున్నారని,మొదటికి మోక్షం లేదుగానీ రెండో విడత ప్రవేశపెట్టినారని జీఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య యాదవ్ అన్నారు.గురువారం ఆయన రెండో విడత గొర్రెల పంపిణీపై ఒక ప్రకటన విడుదల చేశారు.
ఖమ్మం, వరంగల్,నల్గొండ జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని,సుమారు పది నెలల క్రితం మొదటి లబ్దిదారులు డీడీలు తీసినా ఇప్పటి వరకూ అతీగతీ లేదని మండిపడ్డారు.అయ్యా సారూ…మొదటి విడత గొర్రెలు ఎప్పుడు ఇస్తారు?మొదటి విడత అలాగే ఉంచి రెండవ విడత ఎలా పంపిణీ చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని అధికారులను నిలదీయవల్సిన అవసరం గొల్ల కురుమలకు ఉందన్నారు.
ప్రభుత్వం గొల్ల కురుమలను లక్షాధికారులను చేస్తామని మాయమాటలు చెబుతుందని,మన తాత ముత్తాతల కాలం నుండి 200 నుండి150 గొర్రెలు కాసినమని,మనలో ఎంతమంది కోటీశ్వరులై ఇన్నోవా కార్లలో తిరుగుతున్నమో? మనము ఎక్కడున్నామోకేసీఆర్ కే తెలియాలని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఇచ్చిన 21 గొర్రెలకు యాదవులు కోటీశ్వరులని చెబుతున్న సీఎం మాట ఎంతవరకు నిజమో మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నదన్నారు.21 గొర్రెను కాస్తే కాపర్ కి కనీస కూలి గిట్టుద్దా? కుటుంబ పోషణ వెళ్తుందా?ఉపాధి హామీ పని రావడం,రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల గుట్టలు,చెట్లు రియల్ ఎస్టేట్ అవ్వడం వల్ల గొర్రెలను మేపుకునే స్థలం లేకుండా అయినదని, వీటన్నిటిని ఆధ్యాయం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.అందరికీ అన్నీ వర్తిస్తాయి గొల్ల కురుమల సంగతేంది…?రైతులకు రైతుబంధు,రైతు బీమా,రైతు రుణమాఫీ, రైతు మద్దతు ధర,పంట నష్టపరిహారం,పీఎం కిసాన్ యోజన వర్తిస్తాయి.గౌడ సంఘానికి ఎవరి భూమిలో మొలిచిన తాటి,ఈత వనాలపై వాళ్లకే హక్కు ఉంటుంది.ప్రమాడం జరిగితే జీవిత బీమా (ఇన్సూరెన్స్) వర్తిస్తుంది.
దళితులకు దళిత బంధు, గిరిజనులకు పొడు హక్కు వర్తిస్తాయి.మరి వీరందరికీ ఇవన్నీ ఉండవచ్చు కానీ, గొల్ల కురుమలకు ఏది ఎందుకు వర్తించదని మనం ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు.
కనీస భద్రత లేని జీవితాలు గొల్ల కురుమలకే ఎందుకని అన్నారు.గొర్రెల కాపరులైన నూటికి 70 శాతం ఉన్న గొల్ల కురుమలు పిడికెడు జనాభా కలిగిన వారి చేతుల్లో బందీ అయి వారి ఇండ్ల ముందు పొద్దున లేస్తే ఊడిగానికి అలవాటు పడ్డారని,అందుకే యాదవులంతా చైతన్యం కావాలని,గొల్ల కురుమలంతా హక్కుల కోసం తిరగబడి అధికారులను నిలదీయాలన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత గొర్రెలు పంపిణీ లొట్ట పిట్ట పెదాలకు నక్క ఆశపడ్డ సామెతగా యాదవుల మిగిలిందని ఎప్పుడు వస్తాయో తెలవదు ఎప్పుడు ఇస్తారో తెలవదని,కనీస తేదీ ప్రకటించలేని ప్రభుత్వం యాదవులను ఇంకా మోసం చేస్తున్నదని, అందుకే మీ జిఎంపిఎస్ గా ప్రభుత్వాన్ని అడుగుతున్నామని అన్నారు.ఇందుకోసం మే 22న సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేసి,గొల్ల కురుమల శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
ఎలక్షన్లు వస్తే తప్ప గొర్ల పంపిణీ గుర్తు రాదని, ఎన్నికలు వస్తే అక్కడ గొల్ల కురుమల యాదికొస్తారని, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని ప్రభుత్వం యాదవుల మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.గొల్ల కురుమల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే 18 సంవత్సరాలు నిండిన యాదవులకు డీడీలు లేకుండా వారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేయాలని,చదువుకున్న యాదవ విద్యార్థులకు ఉద్యోగ,విద్య అవకాశాలు కల్పించాలని, యాదవులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యాదవులకు వర్తించే విధంగా చూడాలని,వాటితో పాటు దళిత బంధు లెక్క యాదవ బంధు తక్షణమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
వీటన్నిటికీ పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో గొల్ల కురుమల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.