సూర్యాపేట జిల్లా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతోన్మాద విధానాలు అనుసరిస్తున్న బీజేపీని, దానికి సహకరిస్తూ గత పది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించాలన్నారు.
సూర్యాపేట జిల్లాలో సిపిఎం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్న స్థానాలైన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు.సూర్యాపేట,తుంగతుర్తి నియోజకవర్గాలలో పోటీ గురించి త్వరలో చర్చించి చెబుతామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు.మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలతో పాటు పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్ర కమిటీ ప్రకటిస్తుందన్నారు.
ప్రశ్నించే గొంతులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.చట్ట సభలలో కమ్యూనిస్టులకు చోటు లేకపోవడం మూలంగా ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు.కమ్యూనిస్టు అభ్యర్థులు చట్ట సభలలో ఉండటం మూలంగా కార్మికుల, రైతుల,ఉద్యోగ, ఉపాధ్యాయ,మహిళల, యువకుల,దళిత గిరిజన బడుగు బలహీనవర్గాల సమస్యలపై గళం ఎత్తటానికి అవకాశం ఉంటుందన్నారు.రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దిరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, మట్టిపెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,నగరపు పాండు,చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి,పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.