వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆరు నెలల తర్వాత నుంచి చిన్నగా అసంతృప్తి రాగం వినిపించడం మొదలుపెట్టారు.
వైసిపి అగ్ర నేతలు పట్టించుకోవడం లేదని, తనకు తన స్థాయిలో గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదంటూ ఆయన అనేక సందర్భాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.ముఖ్యంగా విజయసాయిరెడ్డి , సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారి వ్యవహార శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పరోక్షంగా జగన్ పరిపాలన పై సెటైర్లు వేస్తూ కాక రేపుతూ వచ్చారు.
చివరికి ఆ విమర్శలు మరి శృతిమించడంతో వైసీపీ అరెస్టు వరకు వ్యవహారాన్ని తీసుకువెళ్ళింది.ఇక అక్కడి నుంచి జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు.
రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం జైలు నుంచి బయటకు వచ్చారు.
బెయిల్ పై ఢిల్లీ లో ఉంటున్నారు అక్కడి నుంచి బిజెపి పెద్దలను కలుస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు.
ఈ తంతు 2024 వరకు జరుగుతూనే ఉంటుంది.కాకపోతే 2024 ఎన్నికలలో రఘురామకృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు ఏమిటనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ఎలాగో ఆయన వైసీపీలో నుంచి పోటీచేసే అవకాశం లేకపోవడంతో, ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.
కాకపోతే బీజేపీ కేంద్ర పెద్దలతో రఘురామ కృష్ణంరాజు కు సాన్నిహిత్యం ఉండడంతో, రాబోయే ఎన్నికల్లో బిజెపి నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకే అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక టిడిపి నుంచి రఘురామ పై సానుకూలత ఉండడంతో, ఆ పార్టీ తరపున ఆయనకే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది.ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయిన దగ్గర నుంచి టిడిపి, జనసేన , బిజెపి లు ఆయనకు మద్దతు గానే మాట్లాడుతూ వస్తున్నారు.
అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు.దీంతో ఈ మూడు పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆయనకు ఎంపీ టికెట్ ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి.