సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఆంధ్ర,తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గ చివరి గ్రామాలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.ఇక్కడి నుండి వివిధ వృత్తుల,అవసరాల నిమిత్తం ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళేవారు,అటు నుండి తెలంగాణకు వచ్చేవారు ఎక్కువ మొత్తంలోనే ఉంటారు.
అదే విధంగా వివిధ రకాల లోడ్లతో లారీలు,ఆటోలు,కార్లు,బైక్ లు కూడా చుట్టూ తిరిగి వయా పిడుగురాళ్ల,మిర్యాలగూడ నుండి రావాలంటే వందల కి.మీ.ప్రయాణించాల్సి రావడంతో కృష్ణా నది తీరంలో బలకట్టును ఆశ్రయించే వారు.ఒకప్పుడు ఈ బల్లకట్టుకి లక్షలలో వేలం పాటలు పాడి నడిపేవారు.
కానీ, మట్టపల్లి వద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వంతెన నిర్మాణం చేశాక చాలా మంది దీనిపై రాకపోకలు సాగిస్తున్నారు.దీనితో బల్లకట్టుపై ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
అయినా కొంతమంది ఎటువంటి అనుమతులు, వేలం పాటలు లేకుండా అనధికారికంగా బల్లకట్టులు నిర్వహిస్తూ ప్రయాణికులను,లారీలను,ఆటోలను,మోటార్ సైకిళ్ళను అధిక ధరలకు తరలిస్తున్నారు.అనధికార బల్లకట్టుపై లారీకి రూ.900,ఆటోలకు రూ.450,బైకులకు రూ.100,ఒక వ్యక్తికి రూ.50 లెక్క తీసుకొని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రవాణా చేస్తున్నారు.రోడ్డు మార్గం ద్వారా,వంతెన ద్వారా వస్తే బార్డర్ చెక్ పోస్టులు ఉంటాయి కాబట్టి,ఇల్లీగల్ బిజినెస్ లైన మద్యం,పిడిఎఫ్ బియ్యం, బెల్లం,పటిక వంటి మొదలగు అక్రమ రవాణాకు ప్రస్తుతం బల్లకట్టు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.ప్రయాణ దూరాన్ని తగ్గించే యోచనతో ఈ బల్లకట్టులు నిర్వహించాలంటే ప్రభుత్వం వేలం పాటలు పెట్టి,పర్మిషన్లు ఇచ్చి,అధికారికంగా నిర్వహించాలి.
కానీ,చింతలపాలెం మండలం,చింత్రియాలలో బలకట్టు నడుపుతున్న వారు నిబంధనలు కృష్ణానదిలో తొక్కి చింతిర్యాల-గోవిందపురం మధ్య బల్లకట్టును యథేచ్చగా నడుపుతున్నా ఎవరికీ పట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.పర్మిషన్స్ లేకుండా బల్లకట్టు ఎలా నిర్వహిస్తున్నారని అధికారులను వివరణ అడిగితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పడం గమనార్హం.
ఇక్కడ బల్లకట్టు నిర్వహణ కోసం ప్రభుత్వం వేలం పాటకు ఎన్నోసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా ఏ ఒక్కరు కూడా వేలంపాటకు హాజరు కావడం లేదని అంటున్నారు.పుకడాకు పైసలు వస్తుంటే,లక్షలు చెల్లించి వేలం పాట పాడేందుకు ఎవరైనా ముందుకు ఎందుకొస్తారని స్థానికులు అంటున్నారు.
అందరికీ తెలిసినా,ఎవరికీ ఏమీ తెలియనట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంటే ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేదెవరని ప్రశ్నిస్తున్నారు.