సూర్యాపేట జిల్లా:పేదలు గౌరవప్రదంగా జీవించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో అధికార పార్టీ నేతలు లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి ఎలాంటి పైరవీలు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న మాటలను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులు తుంగలో తొక్కి సర్కార్ పథకానికి అప్రతిష్ట తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ అక్రమ వసూళ్ల దందాకు తెరలేపిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలోని చివ్వెంల మండలం మోదీన్ పురం గ్రామంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న ఈ డబుల్ దందా బయటికి పొక్కడం,స్థానిక టీఆర్ఎస్ నేతల ఆగడాలు భరించలేక బాధిత లబ్ధిదారులు జిల్లా మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తు రాసుకొని బయలుదేరారని సమాచారం తెలుసుకున్న జిల్లా స్థాయి నేతలు,అధికారులు లబ్ధిదారుల నోరు మూయించెందుకు ఉరుకులు పరుగులు పెడుతున్న పరిస్థితి శనివారం మండలంలో అలజడి చేసింది.అసలు ఏం జరిగింది? మోదీన్ పురం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని నీరుపేదలైన ఒక్కోక్కరి లబ్ధదారుల నుండి స్థానిక టీఆర్ఎస్ నేతల రూ.50 వేలు పైగా వసూళ్లు చేశారని బాధితులు వాపోతున్న వీడియో జిల్లా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనితో అధికార పార్టీకీ చెందిన నేతల అక్రమ వసూళ్ల దందా బట్టబయలు అయింది.
డబ్బులు ఇస్తే డబుల్ బెడ్ రూం మీదే!చివ్వెంల మండలం మోదీన్ పురం గ్రామంలో నివాసముంటున్న బుడిగ జంగాలకు, దళితులకు,పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయడం కోసం 2017లో 50 డబుల్ బెడ్ రూం ఇళ్ల ను నిర్మించారు.ఇటీవల సీఎం కేసీఆర్ నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తామని ఒక ప్రకటన చేయడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు చక్రం తిప్పడం మొదలుపెట్టారు.అమాయక పేదలకు ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి మా మాటే వింటాడు,మేము చెప్పిన వారికే ఇళ్లు ఇస్తారని కల్లబొల్లి కబుర్లు చెప్పి సూమారుగా 30 కుటుంబాల నుంచి ఒక్కోక్కరి దగ్గర రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూళ్లు చేసినట్లు బాధితుల మాటల్లో తెలుస్తుంది.దీంతో పాటుగా అదనంగా కరెంటు మీటరు కోసం మరో రూ.5 వేలు,నల్లా కోసం మారో రూ.3 వేలని లెక్కలు వేసి పేదల నుంచి అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా అర్ధమవుతుంది.దావత్ ల కోసం రెండు కోడి పుంజులు!మోదీన్ పురం జంగాల కాలనీ నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేసిన అధికార పార్టీ నాయకులు అంతటితో ఆగలేదు.వారి దావత్ చేసుకున్న ప్రతిసారి జంగాల కులస్థుల నుంచి కోడి పుంజులను ఇవ్వాలని హుకుం జారీ చేశారు.
ఒక్కోక్క కుటుంబం నుంచి రెండు పుంజులు చోప్పున ఇచ్చామని బాధితులు వీడియోలో వాపోతున్నారు.మంత్రి నా మాట వింటాడు!సూర్యాపేట ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నా మాట వింటాడు.
డబ్బులు ఇచ్చిన విషయం ఎవ్వరికి చెప్పవద్దు.చెప్పితే మీకు డబుల్ బెడ్ రూం ఇళ్లు రాకుండా చేస్తా,మీరు ఇచ్చిన డబ్బులను పై అధికారులకు,నాయకులకు ఇస్తున్నాను.
సారు కోడిపుంజులు కావాలంటున్నాడు, మీరు కోడి పుంజులు ఇవ్వాలి,నాకు అందరూ నాయకులు తెలుసూ, రాజకీయం తెలుసని సదరు వసూళ్ల రాయుళ్లు బెదిరించినట్లు వీడియోలో పేర్కొన్నారు.అంతేకాకుండా తనకు డబ్బులు ఇచ్చిన విషయం బయటకు చెప్పకుండా జంగాల కులస్థులకు చెందిన కులదైవంపై ఒట్టు పెట్టించారని వీడియోలో బాధితులు వెల్లడించారు.
ఈ వీడియో దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానంలో ఆవరణంలో తీసినట్లు తెలుస్తుంది.దందా షూరూ చేసిన అధికార పార్టీ నేతలు.
సంక్రాంతి పండుగ నాటికి నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణి చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు దందాలు చేయడం ప్రారంభించారు.ఇళ్లు లేని పేదవారిని టార్గెట్ చేసి వారితో భేరసారాలు చేస్తున్నారు.
తమకు అధికార పార్టీలో మంచి పేరు,పలుకుబడి ఉన్నదని,నా పైరవీతో మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తామంటూ పేదల చుట్టూ నాయకులు తిరుగుతున్నారు.రూ.50 వేలు నుంచి లక్ష వరకూ అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.మీరు దరఖాస్తు చేస్తే చాలు మీగతా పని అంతా మేము చూసుకుంటాం,ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటుందని ముదస్తూగానే పేదల నుంచి డబ్బులను దండుకుంటున్నారు.
ఈ తరహా దందా జిల్లా అంతటా అధికారపార్టీ నాయకులు చేస్తున్నారు.పేదల అవసరాలను ఆసరా తీసుకోని అధికారపార్టీ నాయకులు డబుల్ బెడ్ రూం ఇళ్ల దందాను షూరు చేశారు.
ఇప్పటికైనా ఇలా డబ్బులు వసూలు చేసే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకొని బీదవాళ్లకు బేషరతుగా ఇళ్లు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.