నల్లగొండ:గతంలో రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా కోరలు చాస్తోంది.చాప కింది నీరులా క్రమంగా వ్యాపిస్తోంది.కొవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్ఠ వేసింది.ఈ కొత్త వేరియంట్ బారినపడి 79 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు వదిలింది.
ఇక మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులో నమోదవుతున్నాయి.మొన్నటి ఆదివారం డిసెంబర్ 17 ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు ఆరుగురు మరణించారు.కాగా తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది.
దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ బులిటెన్ విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మంగళవారం రోజున ఆరోగ్య సిబ్బంది 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.అయితే ఈ నాలుగు కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 9 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది.