నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.వర్షాభావం,తగిన మద్దతు ధర లేకపోవడం,పంటలకు సకాలంలో పెట్టుబడులు దొరకకపోవడం వంటి సమస్యలు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.
యాదాద్రి జిల్లా వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేశారు.కానీ అనుకూల వాతావరణం లేకపోవడంతో, సాగు విఫలమై తీవ్రంగా నష్టపోయారు.
అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చలేక చివరికి పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.ఇదే విధంగా సిరిసిల్ల జిల్లా పోతుగల్లోకి చెందిన దేవయ్య వరి పంట సాగుచేశారు.
కానీ,నీటి ఎద్దడితో పంట ఎండిపోవడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఇక భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్ జిల్లా వేములపల్లిలో వెంకన్నలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు.
తీవ్రంగా నష్టపోయిన వీరు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.వరుసగా నష్టాల బారిన పడటంతో అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక తాము మిగిల్చిన కుటుంబసభ్యులు ఎలా బతుకుతారనే ఆలోచనతో ప్రాణాలు తీసుకున్నారు.
వ్యవసాయంలో విత్తనాలు, ఎరువులు,పురుగుమందుల ఖర్చులు అధికమవుతుండగా, తక్కువ దిగుబడి రావడం రైతులను మరింత భారానికి గురిచేస్తోంది.ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రైతులకు తగిన మద్దతు లేకపోవడమే కారణమని ఆరోపిస్తున్నాయి.రైతుల పరిస్థితిని గమనించి అప్పుల మాఫీ,సబ్సిడీలు,సాగునీటి సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది.
వరుసగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉంది.రైతులకు ఉజ్జీవనంలాంటి విధానాలు అమలు చేయకపోతే, వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.