నల్లగొండ జిల్లా: పదహారేండ్లు కూడా నిండని విద్యార్దులతో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ( Munugode Assembly constituency ) పరిధిలోని నాంపల్లి ప్రసాద్ వైన్స్ నిర్వాహకంపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) బెల్ట్ షాపులపై యుద్ధం ప్రకటించి బెల్ట్ రహిత నియోజకవర్గంగా మునుగోడును మార్చాలని అడుగులు వేస్తుంటే నాంపల్లికి చెందిన ప్రసాద్ వైన్స్ యాజమాన్యం అక్రమ మార్గంలో దానికి తూట్లు పొడుస్తోందని,తన వ్యాపారం పెంచుకోవడం కోసం చిన్నపిల్లల సైతం వదలడం లేదని ఆరోపిస్తున్నారు.
నాంపల్లి మండలంలో వివిధ గ్రామాలలో ఇప్పటికే బెల్ట్ షాపులను మూసి వేయడంతో ప్రసాద్ వైన్స్( Prasad Wines ) కొంతమంది స్కూల్ పిల్లలతో గ్రామాల బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని,నిబంధనల ప్రకారం చిన్నపిల్లలకు మద్యం అమ్మకూడదని, కానీ,పదహారేళ్లు కూడా దాటని పిల్లలతో మద్యం సరఫరా చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.యువత మద్యానికి బానిసలై చెడిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు, అందుకే స్థానిక ఎమ్మెల్యే బెల్ట్ షాపులను కట్టడి చేసే గ్రామానికి రూ.లక్ష నజరానా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు.ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నపిల్లలతో మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.