నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుడ్ కార్పొరేషన్ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు.కస్టమ్ మిల్లింగ్ బియ్యం విషయంలో గతంలో అధికారులు నోటీసులు ఇచ్చినా మిల్లర్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎఫ్సీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు 60 బృందాలుగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలోని 3278 మిల్లుల్లో 2020-21 సంవత్సరానికి గాను వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.గత ఏడాదికి సంబంధించిన రైస్ మిల్లుల నుండి ఎఫ్సీఐకి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన గడువు ముగిసినప్పటికీ మిల్లర్లు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్స్ రైస్ ను ఇవ్వలేదనీ అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట,యాదాద్రి,నల్గొండ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ రావాల్సి ఉండగా,ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 1.17 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ రావాల్సి ఉందని ఎఫ్సీఐ పేర్కొంది.దాడులు నిర్వహిస్తున్న మిలుల్లో ధాన్యం నిల్వలను కూడా పరిశీలిస్తున్నారు.ఆసియాలోనే అత్యధిక మిల్లుల్లో రెండవ స్థానంలో ఉన్న మిర్యాలగూడ ప్రాంతాల్లో రైస్ మిల్లులపై ఎఫ్సీఐ అధికారులు దాడులు చేపట్టారు.
మిర్యాలగూడతో పాటు అత్యధిక రైస్ మిల్లులు ఉన్న కోదాడ,హుజూర్ నగర్ ప్రాంతాల్లోని రైస్ మిల్లులపై కూడా తనిఖీలు చేస్తున్నారని తెలుస్తోంది.సీఎంఆర్ రైస్ ఇవ్వని మిల్లుల్లో ధాన్యం నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు వాస్తవానికి ధాన్యం లేకుంటే నోటీసులు ఇస్తారా? మిల్లును సీజ్ చేసి బ్లాక్ లిస్టులో పెడతారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.రాష్ట్రంలో సీఎంఆర్ బియ్యం సేకరణకు గాను గడువు ముగిసినా మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వకపోవడంతో దాడులు నిర్వహిస్తున్న విషయం విధితమే.కాగా దాడుల అనంతరం బియ్యం ఇవ్వని మిల్లులకు నోటీసులు ఇవ్వడంతో పాటు,బియ్యం ఇవ్వడానికి మరికొంత సమయం ఇస్తారా లేదా అని మిల్లర్లు సందిగ్ధంలో పడిపోయారు.
వీరంతా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యంతో సొంత వ్యాపారాలు చేస్తున్నారని తనిఖీలలో తేలితే చర్యలు తీసుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.ఏది ఏమైనా మిల్లుల నుంచి రావల్సిన బియ్యం సేకరించిన తర్వాత ఆయా మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.