నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండల ఎస్ఐ అనిల్ రెడ్డి అరాచకంతో ఓ మీడియా ప్రతినిధి పరిస్థితి విషమంగా మారింది.వివరాల్లోకి వెళితే కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన మీడియా ప్రతినిధి మెరుగుమళ్ల భిక్షం సోదరునికి తన సమీప బంధువుకి కొద్ది రోజుల క్రితం గ్రామంలో భూ వివాదంలో గొడవ జరిగింది.
తన సమీప బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈవిషయమై మాట్లాడేందుకు పిలిచిన ఎస్సై అనిల్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పది గంటల వరకు విచక్షణారహితంగా దాడి చేశాడని ఆ మీడియా ప్రతినిధి వెల్లడించారు.
బుధవారం ఉదయం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తన బంధువులతో కలిసి చేరుకొని ఈ విషయంపై మాట్లాడారు.పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.
ఇసుక రవాణా కథనాలే కారణమా?
గతంలో ఈ మీడియా ప్రతినిధి మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై పలు కథనాలు ప్రచురించాడు.దీనిని జీర్ణించుకోలేని ఎస్ఐ చిన్నపాటి గొడవను అడ్డుగా పెట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
మాట్లాడటానికి పిలిచి దాడి చేయడం ఎంతవరకు సబబని మీడియా ప్రతినిధి తన ఆవేదనను వెలిబుచ్చాడు.నిజాలను వెలికితీసే మీడియా ప్రతినిధులకు రక్షణ లేకుంటే ఈ సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు
గతంలో ఇసుక అక్రమ రవాణాపై కథనాలు ప్రచురించినందుకు ఎమ్మెల్యే దాడి చేయించారని బంధువులు ఆరోపిస్తున్నారు.ఏదేమైనప్పటికీ నిజాలు వెలికి తీస్తున్న మీడియా ప్రతినిధులపై ఇలాంటి దాడులను అరికట్టాల్సిన ప్రజా ప్రతినిధులు వీటిని ప్రోత్సహించడం మంచిది కాదని జర్నలిస్ట్ సంఘాలు హితవు పలికాయి.
ఎస్ఐ వివరణ ఇదే విషయమై కేతేపల్లి ఎస్ఐ ను వివరణ కోరగా ఓ కేసు విషయంలో కేసు కట్టి,పిలిపించిన మాట వాస్తమే కానీ,ఎవరూ కొట్టలేదని,అతనికి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లు చెప్పారు.కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.