నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూర్ మండలం ఊట్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేసి,అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పాఠశాల ఉపాద్యాయులు,తోటి విద్యార్ధులు తెలిపిన వివరాల ప్రకారం ఊట్కూరు గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది.
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైస్కూల్ గేటు బయట తోటి స్నేహితులతో కలిసి మాట్లాడుతోంది.ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన గద్దల త్రివేణ్ అనే యువకుడు పూటుగా మద్యం తాగి పాఠశాల వద్దకు వచ్చాడు.
గేట్ బయట ఉన్న బాలికను నీతో మాట్లాడాలంటూ చేయి పట్టుకుని పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లాడు.అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలుపడంతో వారు అక్కడికి చేరుకునే సరికి త్రివేణ్ బాలికపై లైంగికదాడికి యత్నిస్తున్నాడు.
ఉపాధ్యాయులను విద్యార్థులను చూసిన త్రివేణ్ బాలికను వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు.తనపైన కేసు పెడతారనే భయంతో ఇంటికి వెళ్ళిన త్రివేణ్ ఇంట్లోనే ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు గమనించి అతడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండాల నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడమనూరు పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శోభన్ బాబు తెలిపారు.
నిందితుడు గద్దల త్రివేణ్ సదరు బాలికను ప్రేమిస్తున్నానని గత కొంతకాలంగా వెంటపడుతున్నట్లు సమాచారం.