రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవ వేడుకలకు( Rythu Dinotsavam ) రైతులు హాజరు కావాల్సి ఉండగా,రైతులను కాకుండా ఉపాధి పనులు నిర్వహించే కూలీలను తరలించడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల( Telangana State Decade Celebrations ) సందర్భంగా వివిధ గ్రామాలలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలకు రైతులను సమీకరించి వేడుకలు నిర్వహించవల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు.
రైతు దినోత్సవ వేడుకలకు కూలీలకు ఏం సంబంధం ఉందో అధికారులు సమాధానం చెప్పాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ నాయకుల మెప్పు పొందేందుకు అధికారులు ఇలా వ్యవహరించడం సమంజసం కాదని,వెంటనే దీనికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,జిల్లా సహాయ కార్యదర్శి నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.