సూర్యాపేట జిల్లా:మద్దతు ధరల చట్టం,కొనుగోలు గ్యారంటీ కొరకు రైతాంగం ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు రైతాంగం సిద్ధం కావాలన్నారు.బీజేపీ పాలనలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని,పూర్తిగా అప్పులపాలై నష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలే ఈదుస్థితికి కారణమన్నారు.సంక్షోభం నుంచి రైతన్నలు బయటపడాలంటే కేంద్రం కనీస మద్దతు ధర పెంచి,చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమగ్ర పంటల బీమాను అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.కార్పొరేట్లు, భూస్వాములకే బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయని,ప్రతి రైతుకూ బ్యాంకులు సున్నా శాతం వడ్డీకి లోన్లు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేయాలన్నారు.
బీజేపీ,ఆర్ఎస్ఎస్ దేశమంతా విస్తరించాలని భావిస్తోందని,ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ సీట్లలో తిష్టవేసిందని తెలిపారు.దేశంలో ప్రతి పౌరునికీ సామాజిక, రాజకీయ,ఆర్థిక సమానతలు రావాలంటే బీజేపీ పోయేందుకు రైతాంగం ఉద్యమించాలని కోరారు.
ఉదారవాద,నయా సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభ పరిస్థితులు తీవ్రమౌతువూ వచ్చాయని,1997 నుంచి 2014 వరకు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ పాలనలో గత ఏడేళ్లలోనే లక్షమందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు.
తెలంగాణలో రోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టి,రైతులను బానిసలుగా మార్చడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు.రైతాంగం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని,ప్రతి పంటకూ గిట్టుబాట ధర కల్పించాలని కేంద్రంపై రైతాంగం తిరగబడటం ఒక్కటే మార్గమని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్ రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత,జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కందాల శంకర్ రెడ్డి,దేవరం వెంకటరెడ్డి,షేక్ సైదా,మందడి రామ్ రెడ్డి,పందిరి సత్యనారాయణరెడ్డి,గుమ్మడవెల్లి ఉప్పలయ్య,పల్లె వెంకట్ రెడ్డి,పల్లా సుదర్శన్, బెల్లంకొండ సత్యనారాయణ,నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, దండా శ్రీనివాస్ రెడ్డి,దుర్గి బ్రహ్మం,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.