సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంపై ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనుచరులే చేస్తున్నారని,ఇందులో అధికారుల పాత్ర శూన్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండోసారి టిక్కెట్ దక్కించుకున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీ క్యాడర్లో జోష్ పెంచుతూ గెలుపే లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తున్నారు.ఇందులో భాగంగానే దళిత,బీసీ,మైనార్టీ బంధు, గృహలక్ష్మి,పోడుభూముల పట్టాల పంపిణీపై దృష్టి పెట్టారు.
అయితే అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు ఎమ్మెల్యే అనుచరుల చేతిలో ఉండడం,అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.దీంతో అధికార పార్టీ నేతలు చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇదే ఆసరాగా చేసుకొని అధికార పార్టీ నేతలు ఫిరాయిపులకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.
కానీ,అధికారుల పాత్ర లేకుండానే తన అనుచరుల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుపుతున్నట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటీవల పంపిణీ చేసిన ప్రభుత్వ పథకాలు సొంత పార్టీలో కొందరికే రావడంతో మిగతా వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.
నేరేడుచర్ల బీసీ బంధులో అన్యాయం జరిగిందని ఓ మహిళ చేసిన వీడియో వైరల్ గా మారింది.పాలకవీడు మండలంలో ఇద్దరికీ బీసీ బంధు వస్తే వాటిని గ్రామంలోని మరి కొందరికి పంచాలని లోకల్ లీడర్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో 1100 దళిత కుటుంబాలకు దళిత బంధు వచ్చే అవకాశం ఉంది.ఇవి కూడా ఆయా గ్రామాల్లోని దళితులందరూ పంచుకోవాలని వత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరు చూస్తే అన్నీ పార్టీ పథకాలుగా మారిపోయాయనే విషయం స్పష్టంగా తేటతెల్లమయిందని ప్రజలు అంటున్నారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రభుత్వ పథకాల అమలులో తీవ్ర వివక్ష చూపుతున్నారని బీఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ రాపోలు నవీన్ ఆరోపించారు.
సొంత పార్టీ వారికే పథకాలు వర్తింప జేస్తూ,ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి వస్తే పథకాలు మీకేనని ప్రలోభాలకు గురిచేస్తూఅర్హులను అన్యాయం చేస్తుండు.గృహలక్ష్మి పథకంలో తాహాసిల్దార్లకి వచ్చిన దరఖాస్తులు 8 రకాల ఫార్మేట్లో జిల్లా కలెక్టర్ కి పంపిస్తారు.
ఎంపిక అనంతరం ఎంపీడీవోలకు లబ్ధిదారుల వివరాలు చేరుతాయి.అవి ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
అప్పటి వరకు గోప్యంగా ఉంచాల్సిన లబ్ధిదారుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ కావడం అనుమానాలకు తావిస్తోంది.అసలు ఇవి ప్రభుత్వ పథకాలా? పార్టీ పథకాలా అర్దం కావడం లేదు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని,రాబోయే ఎన్నికల్లో ఈ పథకాలే ఎమ్మెల్యే పతనానికి కారణమవుతాయన్నారు.