సూర్యాపేట జిల్లా:ప్రతీ ఒక్కరి జీవిత చివరి మజిలీ కూడా సకల సౌకర్యాలతో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఊరిలో వైకుంఠధామాల ( Vaikuntadhamam )పేరుతో స్మశాన వాటికలు నిర్మించిన విషయం తెలిసిందే.ఈ స్మశాన వాటికల్లో చనిపోయిన వారికి గౌరవ ప్రథమంగా అంతిమ సంస్కరాలు నిర్వహించడం జరగాలని ప్రభుత్వం భావించింది.
కానీ,సూర్యాపేట జిల్లా( Suryapet District ) గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్మించిన వైకుంఠధామం ప్రధాన ద్వారాలు కూడా తెరుచుకోలేనంతగా పూర్తిగా పిచ్చిచెట్లతో నిండిపోయి, అంత్యక్రియలు చేసేందుకు నిరుపయోగకరంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు.
వైకుంఠధామం పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే వారే సొంత ఖర్చులతో చెట్లను తొలగించి అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సి వస్తుందని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వైకుంఠధామం యొక్క సమస్యలను తొలగించి,అంత్యక్రియలకు అందుబాటులోకి తీసుకరావాలని కోరుతున్నారు.