నల్లగొండ జిల్లా:కాకతీయ సామ్రాజ్యన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి అత్యంత ధైర్యస్థురాలని, తెలుగు జాతికి గర్వ కారణమని,ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకం,ఆదర్శప్రాయమని రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ పేర్కొన్నారు.
మంగళవారం ఆమె నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి మరణ శాసన ప్రాంగణాన్ని సందర్శించారు.చందుపట్ల గ్రామం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.
చందుపట్ల రాణి రుద్రమదేవి విగ్రహం సందర్శించి రాణి రుద్రమదేవి ఫోటోకు పూలమాల వేశారు.అనంతరం రాణి రుద్రమ మరణాన్ని తెలిపే చందుపట్ల శిలాశాసనం సందర్శించి పూలుచల్లి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాణి రుద్రమ చరిత్ర ప్రాముఖ్యానికి నోచు కొలేదని,రుద్రమ దేవి చరిత్రను అందరికీ తెలియాల్సిన అవసరముందని అన్నారు.ఇంతటి చరిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతాన్ని స్మారక కేంద్రం నిర్మించి,పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని అన్నారు.
చందుపట్లను సందర్శించి గ్రామస్థులతో మాట్లాడి కాకతీయ పరిపాలకురాలు రాణి రుద్రమదేవికి నివాళులు అర్పించేందుకు వచ్చానని తెలిపారు.గ్రామ ప్రవేశంలో కాకతీయ ప్రాముఖ్యతను తెలిపేలా స్వాగత ద్వారం నిర్మించాలని గ్రామస్థులు కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్,డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి,డిపిఆర్ఓ శ్రీనివాస్,రాష్ట్ర పురావస్తు,వారసత్వ శాఖ నుండి సహాయ సంచాలకులు బుజ్జి,ఆదిత్య శర్మ, పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య,నకిరేకల్ ఎంపిడిఓ వెంకటేశ్వర్ రావు,కమిషనర్ బాలాజీ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు నార్కట్ పల్లి మండలంలోని ఓసిటిఎల్ అతిథి గృహం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర గవర్నర్ కు అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, సూర్యాపేట ఎస్.పి.రాజేంద్రప్రసాద్,డిఆర్ఓ జగదీశ్వర్ రెడ్డిలు మొక్కలు అందజేసీ స్వాగతం పలికారు.