యాదాద్రి జిల్లా:యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి ఆటోలో అనుమతించాలని కోరుతూ ఆటో కార్మికుల నిరసన కొనసాగుతుంది.అందులో భాగంగా ఆదివారం యాదగిరిగుట్ట ఆటో కార్మికులు తమ ఆర్తనాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినిపించి,తమపై దయకలగాలని కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి,అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ కొండపైకి ఆటోలు నిరాకరించడంతో 300 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.ఆలయ ఈవో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వలన తమ కుటుంబాలు వీధిన పడ్డాయని తెలిపారు.
ఇంతకాలం గుట్టను నమ్ముకుని ఆటోలను జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్న మమ్ముల్ని గుట్టపైకి రాకుండా ఆంక్షలు విధించి తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు.ఇప్పటికైనా ఆటోలను కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.