నల్లగొండ జిల్లా:మునుగోడులో అభ్యర్థిని ప్రకటించే దమ్ము టిఆర్ఎస్ కు లేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.మునుగోడు మండల కేంద్రంలో ఘట్టుప్పల్,పలివెల గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది ఆయా పార్టీల యువకులు శుక్రవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ ఇస్తానన్న హామీ ఎటుపోయింది? ప్రాజెక్ట్ ల పేరు మీద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తావ్.కానీ,రైతులకు రుణమాఫీ ఎందుకు తక్షణమే అమలు చేయట్లేవ్ అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మూడున్నర ఏండ్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో అనేక మార్లు కొట్లాడిన,ఇక్కడ గతంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏనాడైనా అసెంబ్లీలో ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు.మంత్రి జగదీశ్ రెడ్డి బీజేపీ కార్యకర్తలను ఉరికిచ్చి కొడతాననే మాటలు మాట్లాడాడని తెల్సింది.
ముందు నీ సూర్యాపేటలో నీ సక్కదనం చూసుకో,వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టే బాధ్యత నాది అని హెచ్చరించారు.నా వెంట ఉండే సర్పంచులకు,ఎంపీటీసీలకు 20 లక్షల ఇచ్చి కొంటున్నారు,అవినీతి డబ్బు సంచులతో నియోజకవర్గంలో తిరుగుతూ నన్ను ఓడించడానికి రెండు గ్రామాలకి ఒక ఎమ్మెల్యేని ఇంచార్జ్ గా పెట్టారు,టిఆర్ఎస్ కండువాలు కప్పుకుంటేనే గోర్లు ఇస్తామంటున్నారు,అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇస్తామని బెదిరింపులకి పాల్పడుతున్నారు, దమ్ముంటే అర్హులైన పేదలకు పార్టీలకతీతంగా పథకాలు అమలు చేయాలి,మీ అహంకార ధోరణికి మునుగోడు నుంచే పతనం ప్రారంభం కానున్నదని జోస్యం చెప్పారు.
పేరుకే పవర్ మినిస్టర్ కానీ, ఎటువంటి పవర్ లేదు జగదీష్ అనీ దెప్పిపొడిచారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో 90% పూర్తి అయిన ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం పనులను పూర్తి చేయడం చేతకాదు కానీ,ఇక్కడ ఉన్న రోడ్లను మళ్ళీ సీఎం మీటింగ్ పెట్టేలోపు బాగు చేయాలని కంకణం కట్టుకున్నారట,మీరెన్ని చేసినా మీ రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యన్ని మునుగోడు ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి మచ్చలేని నాయకుడు,8 ఏండ్లుగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాడు,కానీ, అవినీతిలో నెంబర్ వన్ స్థానం కేసీఆర్ ఉన్నాడని అన్నారు.టీఆర్ఎస్ శ్రేణులు రైతులను భయబ్రాంతులకు గురి చేసే కుట్రలు చేస్తున్నారు.
ఈ విధానం వల్ల ఏ ఒక్క రైతు నష్టపోయే పరిస్థితి లేదు,కావాలని టీఆర్ఎస్ మోటార్లు,మీటర్లని రైతులని బయపెడుతుందని,ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో కాషాయ జెండా ఎగుర్తుందని,దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.