నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్( kcr ) నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ డ్రామాకు తెరలేపారని బీజేపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ నేత డాక్టర్ రవికుమార్ నాయక్ అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాన్ని బీజేపీ ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్టుని తీర్చిదిద్దుతామని గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్( MLA Nomula Bhagat Kumar ) ప్రకటించారని,నెల్లికల్ లిఫ్టు గత పాలకులు 5 వేల ఎకరాల కోసమే రూపొందించారని,కానీ, తాము 25వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేలా నెల్లికల్ లిఫ్టును రీడిజైన్ చేస్తామని మరియు సాగునీటి కోసం రూ.684 కోట్లతో నెల్లికల్ లీఫ్ట్ నిర్మాణం సాగుతుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సాగర్ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారే తప్ప చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.అలాగే రైతుల పక్షపాతినని చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన ఫామ్ హౌస్ కే పరిమితమై రైతులకు,నిరుద్యోగులకు,ఏ వర్గానికి న్యాయం చేయలేదని చెప్పారు.
ఇక్కడికి వస్తే ప్రజలు తిరగబడతారని ఈ నెల్లికల్ సైడ్ రాకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు.గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అకారణంగా దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని అన్నారు.
ఈ ఎన్నికల్లో గిరిజనులంతా ఏకతాటిపై ఉండి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని,ఈ ప్రాంత ప్రజల కోసం పని చేస్తున్న బీజేపీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి(సాగర్) మండల అధ్యక్షుడు పాండు నాయక్,పాల్తి శంకర్ నాయక్,నగేష్, మోహన్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.