నల్లగొండ జిల్లా: ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ, పురుషులందరూ సమానమేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది.శని శింగనాపూర్,హాజీ అలీ దర్గా,శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది.
మసీదులు, జషన్లతో పాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.మహిళలు పురుషులకంటే ఏమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది.
పురుషుడికంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని ప్రశ్నించింది.దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానులేనని, దేవునికి లింగ వివక్ష ఉండదని స్పష్టం చేసింది.పురుషుడి కంటే స్త్రీ తక్కువ అని భావిస్తే జన్మనిచ్చిన తల్లి కూడా మహిళేనని,తల్లి మనకంటే తక్కువ ఎలా అవుతుందని కోర్టు నిలదీసింది.నిర్దిష్టమైన కొద్దిరోజులు మినహా మహిళలు నిరభ్యంతరంగా ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.