ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చెప్పుకోదగినంత స్థాయిలో కాకపోయినా, ఫర్వాలేదు అన్నట్లుగా ఉంది.2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత టిడిపి పని ఏపీలో ముగిసిపోయింది అని అనుకున్నా, ఆ పార్టీ మెల్లి మెల్లిగా బలం పెంచుకుంటూ వస్తోంది.నిరంతరం ఏదో ఒక అంశంపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, ఆ పార్టీ అగ్ర నాయకులు హడావుడి చేస్తున్నారు.దీనికి తోడు జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టు కేసులు, తదితర కారణాలతో టిడిపికి కాస్త ఊపు కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఆ పార్టీ బీజేపీ తో కాని, జనసేనతో కానీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తుండగా, ఇప్పుడు బీజేపీ లోని కొంతమంది నేతలు టీడీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఏపీలో బిజెపి పుంజుకుంటుంది అనే ఆశ మొన్నటి వరకు కనిపించినా, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు బిజెపి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.ఇక ఎప్పటికీ ఏపీలో బీజేపీ అధికారం సంపాదించే అంత స్థాయికి వెళ్ళలేదు అనే అభిప్రాయం ఆ పార్టీ మెజారిటీ నాయకుల్లో వచ్చేసింది.ఈ క్రమంలోనే టిడిపి నుంచి బిజెపిలో చేరిన నేతలతో పాటు , మరి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో పాటు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు గా ముద్ర వేయించుకున్న బిజెపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో పాటు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, అలాగే విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో పాటు మరి కొంత మంది టిడిపిలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది.

అయితే కన్నా లక్ష్మీనారాయణ , ఆదినారాయణ రెడ్డి వంటివారు టీడీపీలో చేరినా పెద్దగా ఆశ్చర్యం ఏమి ఉండదు కానీ , రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి , సీఎం రమేష్ పార్టీ మార్పుపై కొన్ని సందేహాలు ఉన్నాయి.దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అనేక వ్యాపార వ్యవహారాలు చేస్తున్న సీఎం రమేష్ లు బీజేపీ వంటి జాతీయ పార్టీని కాదు అనుకుని టిడిపిలో చేరడం వల్ల వారికి కొత్తగా కలిసి వచ్చేది ఏమి ఉండదు.అలాగే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి వైపు వచ్చేందుకు ఏ మాత్రం ఇష్ట పడే అవకాశం ఉండదని, వీరి విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.