ఈ కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగాపెరిగింది.అందులో భాగంగా చిన్న చిన్న రీల్స్తోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలనే కోరిక చాలా మందిలో పెరిగిపోయింది.
వినోదం కోసం చేస్తోన్న రీల్స్(REEL ) కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదకరమవుతున్నాయి.ఇప్పటికే ఎన్నో ఉదంతాలు మన కళ్లముందే జరిగాయి.
తాజాగా అలాంటి ఓ విషాదకర ఘటన ఉత్తరాఖండ్లో (Uttarakhand)చోటుచేసుకుంది.ఒక మహిళ రీల్ కోసం ప్రయత్నించగా.ఆమె ప్రాణాలు కోల్పోయింది.ఆ ఘటన కెమెరాలో రికార్డై.సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటన ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలోని మణికర్ణిక ఘాట్(Manikarnika Ghat in Uttarkashi, Uttarakhand) వద్ద చోటు చేసుకుంది.
ఓ మహిళ గంగా నదికి దగ్గరగా వెళ్లి వీడియో రికార్డింగ్ కోసం ప్రయత్నించగా ప్రమాదం జరిగింది.రీల్ తీయడానికి నీటి ఒడ్డున నిలబడిన ఆమె ఒక్కసారిగా కాలుజారి లోతు ప్రాంతంలోకి పడిపోయింది.
అదే సమయంలో గంగానది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో, ఆమె నీళ్లలో కొట్టుకుపోయింది.ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె పిల్లలు అక్కడే ఉన్నారు.“మమ్మీ.మమ్మీ” అంటూ అరుస్తూ ఆమెను బతికించేందుకు ప్రయత్నించినా అది ప్రయోజనం లేకుండా పోయింది.ఆ దృశ్యం చూసినవారు కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.గాలింపు చర్యలు ప్రారంభించినప్పటికీ, ఇప్పటికి మహిళ మృతదేహం కనిపించలేదు.ఆమె వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.సోషల్ మీడియాలో ఫేమ్ (Fame on social media) కోసం ప్రాణాలతో చెలగాటం ఆపాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.రీల్ల కోసం జీవితం ప్రమాదంలో పెట్టడం ఎంత అసాధారణమైనదో, ఎంత భయంకరమైనదో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ముఖ్యంగా పిల్లల కన్నీళ్ల మధ్య తల్లి ప్రాణాలు కోల్పోవడం మానవత్వాన్ని కదిలించే దృశ్యంగా మారింది.