నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్న నూతన చట్టాలపై ప్రతి పోలీసు అధికారి,సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sarath Chandra Pawar ) అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన చట్టాలపై దశల వారిగా ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.
కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం- 2023 పై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమన్నారు.
కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే సాధ్యమని,కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమని,అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చాన్నారు.
అరెస్ట్,వాంగ్మూలం నమోదులో పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించాల్సిన తీరు, తదితర అంశాలపై కొత్త చట్టాలలో మార్పుల గురించి వివరించారు.భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని,అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాలను రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు.
నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు,విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని,ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ నూతన చట్టాలపై పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడంలో సమన్వయాధికారిగా వ్యవహరించిన అధికారులను అభినందించారు.ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రాములు నాయక్,ఎస్బి డిఎస్పీ రమేష్,నల్గొండ డిఎస్పి శివరాంరెడ్డి,డిసిఆర్బీ డిఎస్పీ సైదా,సిఐలు రాఘవరావు, కరుణాకర్,మహాలక్షమయ్య,సైదులు ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.