ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాల్లోకి మరింత విస్తృతంగా వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజలకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ , వారి సమస్యలను అడిగి తెలుసుకునే కార్యక్రమం కొనసాగిస్తుండగా, ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్( Maa Nammakam Nuvve Jagan ) పేరుతో ఇంటింటికి జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్లను అంటించే కార్యక్రమానికి తెరతీసింది.
దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో కేడర్ అంతా కదిలి మరీ జనాల ఇళ్లకు వెళ్లి , ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తూ , వైసిపి టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్డ్ కాల్ ఆయా ఇళ్లలోని వారితో చేయిస్తున్నారు.అయితే దీనికి కౌంటర్ గా ఇప్పటి వరకు జనసేన టిడిపిలు పోటా పోటీగా స్టిక్కర్లు అంటిస్తూ వస్తోంది.
అయితే ఈ వ్యవహారం చాలా చోట్ల ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు, టిడిపికి అనుకున్న స్థాయిలో మైలేజ్ దక్కకపోవడంతో ఈ కార్యక్రమానికి ఇక పులిస్టాప్ పెట్టాలని టిడిపి( TDP ) ప్రాథమికంగా నిర్ణయించుకుంది.
అయితే ఈ స్టిక్కర్ల అంశాన్ని వదిలిపెట్టకుండా వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు పన్నుతోంది.దీనిలో భాగంగానే జనాలు జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్లు అంటిస్తున్న వాలంటీర్లు ,అధికారులను టార్గెట్ చేసుకుని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.స్థానికంగా ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లకు వాలంటీర్లపై ఫిర్యాదు చేయాలని టిడిపి నిర్ణయించుకుంది ఈ ఫిర్యాదులు చేసేందుకు అనువుగా నిర్ణీత ఫార్మేట్ ను కూడా టిడిపి నేతలకు పంపినట్లు సమాచారం.
ఈ ఫార్మేట్ లో నిబంధనలకు విరుద్ధంగా జగన్ స్టిక్కర్లు అంటిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు, ఇతర వివరాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.వీటిపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోకపోతే కోర్టుల ద్వారానే ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేసి , ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి కోర్టులు ద్వారానే పుల్ స్టాప్ పెట్టించే వ్యూహానికి టిడిపి సిద్ధమవుతోంది.