తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ ఎంతో ముఖ్యమైనది.చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఉగాది పండుగ నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ఉగాది పండుగ వసంత కాలంలో వస్తుంది.
ఏప్రిల్ 12న శార్వరి నామ సంవత్సరం ముగిస్తూ… ప్లవ నామ సంవత్సరం ఆరంభం కాబోతుంది.ఏప్రిల్ 13న చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
ఉగాది పండుగ రోజు ఉదయం నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరించి, పిండి వంటలు తయారుచేసి, మామిడి తోరణాలు ఇంటి ముందు రంగవల్లులతో వసంత లక్ష్మిని మన ఇంటికి ఆహ్వానిస్తాము.ఉగాది పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.మన శాస్త్రాలలో ఉగాది పచ్చడిని ”నింబ కుసుమ భక్షణం”బీ ”అశోక కళికా ప్రాశనం ” అని వ్యవహరించే వారు.ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడిని భావించేవారు.“త్వామస్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతాప్తాం మమ శోకం సదా కురు!!”
ఈ మంత్రాన్ని చదువుతూ ఉగాది పచ్చడిని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు, మామిడికాయ ముక్కలు, వేప పూత, చెరుకు, జీలకర్ర వంటి పదార్థాలను ఉపయోగించాలి.
ఉగాది పచ్చడిలో ఉపయోగించే 6 రుచులు మన జీవితంలో దేనికి ప్రతీకనో ఇక్కడ తెలుసుకుందాం.
*బెల్లం-తీపి-ఆనందానికి సంకేతం
*ఉప్పు-జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
*వేపపువ్వు-చేదు-బాధకలిగించే అనుభవాలు
*చింతపండు-పులుపు-నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
*మామిడికాయ ముక్కలు-వగరు-కొత్త సవాళ్లను ఎదుర్కోవడం.
*కారం-సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు.ఈ విధంగా ఆరు రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని పండితులు చెబుతున్నారు.