కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.ప్రభుత్వం బీసీ రుణాలిస్తామని ప్రకటించడంతో కొండంత ఆశతో నిరుద్యోగులు బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
అధికారులు వీరిలో కొంతమందికి 2018 ఎన్నికల సమయంలో రుణాలు అందజేసి మిగతా వారికి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఇవ్వలేదు.బీసీ కార్పొరేషన్ రుణం ఇవ్వకపోవడంతో, వ్యాపారం చేసుకునేందుకు అవకాశం లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీసీ సంక్షేమశాఖ 2017-18 సంవత్సరంలో స్వయం ఉపాధి రుణాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది.వివిధ కేటగిరీల కింద వేలసంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు.
ఇందులో కొంతమందికి మత్రమే రుణాలు ఇవ్వగా, మరికొందరు అర్హులైన అభ్యర్ధులు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి రుణాలు మంజూరు చేయక పోవడంతో అర్హులైన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.వాస్తవానికి జిల్లాకు రుణ లక్ష్యం కేటాయించి దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేయాల్సి ఉండగా, ఆ దిశగా అమలుకు నోచుకోవడం లేదు.
2018లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 4,126 మంది బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, 2571మంది అర్హులుగా గుర్తించారు.యూనిట్కు లక్ష విలువ చేసే కేటగిరి-1 కింద 854 మందిని ఎంపిక చేశారు.
యూనిట్ విలువ 2లక్షల విలువ చేసే కేటగిరి-2 కింద 1051మందిని ఎంపిక చేశారు.
యూనిట్ విలువ 3నుంచి 12లక్షల విలువ చేసే కేటగిరీ-3కింద 666మందిని ఎంపిక చేశారు.50వేల వంతున రుణాన్ని 529మందిని ఎంపిక చేసి అందజేశారు.ఇప్పటివరకు మిగతావారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్తో ఉపాధి అవకాశాలు కొందరికి చేజారాయి.ఈక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు జిల్లాలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు.ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తే స్వయం ఉపాధితో ఏదైనా వ్యాపారాలు చేసుకుంటామన్నారు.ఆర్థికంగా ఎదుగుదామన్న యువతకు నిరాశే మిగిలింది.
బీసీ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేస్తే యువకులు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు.కానీ చాలామందికి ఇప్పటి వరకూ రుణాలు రాలేదు.
ప్రభుత్వం స్పందించి త్వరగా బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులు కోరుతున్నారు.