నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వం చేసిన ఘన కార్యంతో ఆర్టీసి పల్లె వెలుగు ( TS RTC )బస్సు గ్రామీణ ప్రాంతాల ప్రజల కంటికి కనిపించక దశాబ్దం కావస్తుంది.దీనితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళాలంటే ఆటోలను,ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
కేవలం జాతీయ రహదారులపై మాత్రమే పల్లె వెలుగులు తిరగడం వల్ల మారుమూల ప్రాంతాల నుండి ప్రజలు, విద్యార్థులు నానా తంటాలు పడి ప్రధాన రహదారులకు చేరుకున్నా సమయానికి ఆర్టీసి బస్సులు రాక,పల్లెల నుండి మండల, నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర కేంద్రాలకు చేరుకునే ప్రయత్నంలో మళ్ళీ ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే పరిస్థితే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది.
ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్నా అసలు బస్సులు రాని పల్లెల నుండి మహిళలు బస్సు ప్రయాణం ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పల్లె వెలుగు బస్సులు( Pallevelugu busses ) మొత్తం ప్రధాన పట్టణాలకే పరిమితం కావడంతో ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే ప్రజలు అధిక రవాణా చార్జీలతో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకే కాదు కొన్ని మండల కేంద్రాలకు కూడా బస్సు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు.నూతన సర్కార్ మహిళా సౌలభ్యం కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం హర్షించదగ్గదే కానీ,ఆ పథకం సంపూర్ణంగా అమలు జరిగి,ప్రతీ మహిళకు న్యాయం జరగాలంటే ప్రతీ పల్లెకు ఆర్టీసి పల్లె వెలుగు రావాలని,ప్రభుత్వం దానిపై దృష్టి సారించాలని జిల్లాలోని మహిళలు కోరుతున్నారు.
పల్లెకు పల్లె వెలుగు రావడం వల్ల ప్రజలకు,విద్యార్థులకు కూడా చాలా మేలు జరుగుతుందని,సురక్షిత ప్రయాణం కూడా అందుతుందని,ఆర్ధిక నష్టం కూడా జరగదని అంటున్నారు.ఈ విషయమై కొత్తగా ఎన్నికైన ఎమ్మేల్యేలు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పల్లెల్లో ఆర్టీసి బస్సులను పునరుద్ధరించేలా చూడాలని అంటున్నారు.