నల్లగొండ జిల్లా:ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించగా అవమాన భారంతో పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన మండలంలో శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే… వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గ్రామానికి చెందిన గంట క్రిష్ణయ్య గత నెల 21 తేదీన రాత్రి సమయంలో వివాహిత ఇంట్లో ప్రవేశించి భయపెట్టి లైంగిక దాడికి ప్రయత్నించారు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంట పడడంతో పారిపోయాడు.అనంతరం మహిళ మనస్థాపంతో ఇంట్లో ఉన్న పురుగు మందులు సేవించింది.
వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితురాలు కుటుంబ సభ్యులు గత నెల 22వ తేదీన ఫిర్యాదు చేశారు.కేసు నమోదు కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి సమక్షంలో రాజీ చేయడానికి ప్రయత్నించి విషయాన్ని గోప్యంగా ఉంచారు.
అదే సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించిన కృష్ణయ్య సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.చికిత్స అనంతరం కృష్ణయ్య కోలుకున్నడు.
కానీ, బాధితురాలు పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని,లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేసినట్లు,విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.