సూర్యాపేట జిల్లా:దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చిన ప్రతిష్టాత్మకమైన పథకం దళిత బంధు.అంతటి ప్రాముఖ్యత కలిగిన దళిత బంధు కింది స్థాయి గులాబీ లీడర్ల చేతిలో చిక్కి దగా బంధుగా మారిందని ఆరోపిస్తూ నియోజకవర్గంలో మొన్న గరిడేపల్లి,నేడు మఠంపల్లి మండలాల్లో దళిత మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
సోమవారం మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో దళిత బంధు పథకం అమలులో అధికార పార్టీ నేతల తీరుపై స్థానిక దళిత మహిళలు రోడ్లెక్కి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు రెండో విడతలో భాగంగా నియోజకవర్గంలో యూనిట్లు కేటాయించినట్లు సమాచారం అందులో అధికార పార్టీకి చెందిన వారికే కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని,పార్టీలు చూడకుండా అర్హులైన దళితులకు దళిత బంధు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మొదటి విడతలో భాగంగా మఠంపల్లి మండలం కిష్టాపురం, పాలకవీడు మండలంలోని కోమటికుంట గ్రామాలను దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 100 యూనిట్లు దళిత కుటుంబాలకు పంపిణీ చేశారూ.రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దళిత బంధు తెస్తే అధికార పార్టీకి చెందిన నాయకులు దానిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అమాయక దళిత మహిళలకు లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టి రోడ్లపై ధర్నాలు చేపిస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.